రిలయన్స్ జియో సరికొత్త ఆవిష్కరణ చేసింది. సెట్-టాప్ బాక్స్ ద్వారా టీవీలను వ్యక్తిగత కంప్యూటర్లుగా వాడుకునే సదుపాయాన్ని రిలయన్స్ జియో తీసుకొచ్చింది. అయితే వినియోగదార్లు ఈ సేవను పొందాలంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ వెబ్సైట్లో లభ్యమవుతున్న సమాచారం మేరకు జియో పీసీ సబ్స్క్రిప్షన్ నెలవారీ పథకం రూ.599 నుంచి (జీఎస్టీ అదనం) ప్రారంభం అవుతుంది.
ఒక యేడాది మొత్తానికి ఒకేసారి అయితే రూ.4,599 (జీఎస్టీ అదనం) చెల్లించాలి. ఇలా కడితే నెలకు దాదాపు రూ.383 మాత్రమే చెల్లించినట్టు అవుతుంది. పీసీ సేవలను పొందాలంటే జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ వినియోగదార్లు యాప్ విభాగంలో జియో పీసీ యాప్పై క్లిక్ చేయాలి. టీవీని వ్యక్తిగత కంప్యూటరుగా వాడాలంటే వినియోగదార్లకు ఒక కీబోర్డు, మౌస్ అవసరం అవుతాయి.
ఇలా వాడే కంప్యూటరులో 8 జీబీ ర్యామ్, 100 జీబీ క్లౌడ్ స్టోరేజీ లభిస్తుంది. 'డిజైన్, ఎడిటింగ్ టూల్ అయిన అడోబ్ ఎక్స్ ప్రెస్ సేవను వినియోగదార్లు ఉచితంగా పొందేందుకు అడోబ్లో జియోపీసీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
కీలక కృత్రిమ మేథ టూల్స్, ప్రముఖ అప్లికేషన్లు, 512 జీబీ క్లౌడ్ స్టోరేజ్ లాంటివి సబ్స్క్రిప్షన్లో చేర్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. జియో పీసీ ఒక నెల ఉచిత ట్రయల్లో జియో వర్క్ స్పేస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (బ్రౌజరు), 512 జీబీ క్లౌడ్ స్టోరేజ్ను పొందొచ్చు.