Publish Date: Thu, 18 Sep 2025 (11:55 IST)
Updated Date: Thu, 18 Sep 2025 (12:00 IST)
ఆగ్రాలో ఘోరం జరిగింది. ఛార్జింగ్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు చెలరేగడంతో ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్లో నిద్రిస్తున్న దంపతులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రాలోని జగదీష్పురాలో లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ప్రమోద్కు పెళ్లై పాప కూడా వుంది. పైన అంతస్థులో తన ఫ్యామిలీతో వుండగా.. అతని తల్లిదండ్రులు 90 ఏళ్ల భగవతి ప్రసాద్, 85 ఏళ్ల ఊర్మిళాదేవి గ్రౌండ్ ఫ్లోరులో వుంటారు.
తాజాగా ప్రమోద్ తన ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఎలక్ట్రిక్ స్కూటర్కు ఛార్జింగ్ పెట్టి పడుకోవడానికి ఇంటి పైకి వెళ్లాడు. అదే సమయంలో తన 14 ఏళ్ల కుమార్తె కాకుల్ను తాత, నాన్నమ్మ దగ్గరే వదిలిపెట్టి వెళ్లాడు. అలా కొద్ది సేపటి తర్వాత ఒక్కసారిగా స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఇళ్లంతా వ్యాపించాయి.
ఈ మంటల్లో ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో నిద్రిస్తున్న ప్రమోద్ తల్లిదండ్రులు భగవతి ప్రసాద్, ఆయన భార్య ఊర్మిళా దేవి, 14ఏళ్ల చిన్నారి కాకుల్ మంటల్లో చిక్కుకున్నారు. వెంటనే తాత భగవతి ప్రసాద్ తన మనవరాలు కాకుల్ను ఎలాగోలా నిద్రలేపి పైకి పంపాడు. కానీ భగవతి, అతని భార్య ఊర్మిళ లోపల చిక్కుకున్నారు. ఆపై అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
కాలిన గాయాలతో ఉన్న వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు. కానీ వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర డీసీపీ సోనమ్ కుమార్ తెలిపారు.