భారత్లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఈ ప్రమాదంలో 265 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతులకు సంబంధించిన నాలుగు కుటుంబాలు విమానాల తయారీ సంస్థ బోయింగ్పై అమెరికాలో దావా వేశాయి. ఈ పిటిషన్లో విడిభాగాల తయారీ సంస్థ హనీవెల్ పేరును కూడా చేర్చాయి.
ఈ మేరకు ఆ కుటుంబాలు మంగళవారం దాఖలు చేసిన ఈ దావాలో.. ఇంధన స్విచ్లు లోపభూయిష్టంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించాయి. 787 డ్రీమ్లైనర్ విమానం డిజైన్, దాని విడిభాగాల అభివృద్ధి సమయంలోనే వారికి లోపాలు తెలుసని.. అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నారు.
'ఇంధన సరఫరా, విమాన థ్రస్ట్ నియంత్రణకు సంబంధించిన డిజైన్లో లోపం ఉంది' అని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. అంతేకాక.. అకస్మాత్తుగా వచ్చిపడే ప్రమాదాలను నిలువరించేందుకు ఆ రెండు సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నాయి. స్విచ్లకు తనిఖీలు, మరమ్మతులు అవసరమని విమానాయాన సంస్థలను హెచ్చరించలేదన్నారు. వాటిని రీప్లేస్ చేసేందుకు అవసరమయ్యే విడిభాగాలను పంపించడంలో కూడా ఈ రెండు కంపెనీలు విఫలమైనట్లు తెలిపాయి. ఈ పిటిషన్పై బోయింగ్, హనీవెల్ సంస్థలు ఇప్పటి వరకు స్పందించలేదు.
కాగా, అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.