మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారు పాలన సాగిస్తుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కొనసాగుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఉన్నారు. ఈయన గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు షిండే పరోక్ష హెచ్చరిక చేశారు. తనను తక్కువ అంచనా వేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు మహాయుతి కూటమిలో విభేదాల ఉన్నాయనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలో జరిగే పలు కీలక సమావేశాలకు షిండే దూరంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో తనను తేలిగ్గా తీసుకోవద్దన్నారు. తనను ఒకసారి తేలిగ్గా తీసుకున్నందుకు 2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిందని ఆయన గుర్తుచేశారు.
కాగా, షిండే సీఎంగా ఉన్న సమయంలో ఆమోదించిన రూ.900 కోట్ల జల్నా ప్రాజెక్టును ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిలిపివేశారు. పైగా, దర్యాప్తునకు ఆదేశించారు. ఈ చర్య షిండేకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దీనిపై ఆయన స్పందించారు. "తానొక సాధారణ పార్టీ కార్యకర్తలు. కానీ, నేను బాలా సాహెబ్ వద్ద కూడా పని చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి. 2022లో నన్ను తేలిగ్గా తీసుకోవడంతో అప్పటి ప్రభుత్వం కుప్పకూలిపోయింది అని గుర్తు చేశారు.
2022లో షిండే రెబెల్గా మారి 40 మంది ఎమ్మెల్యేలతో శివసేన పార్టీని అడ్డంగా చీల్చేశారు. దీంతో అప్పటి మహావికాట్ అఘాడీ ప్రభుత్వం పతనమైంది. ఆ తర్వాత ఆయన బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 స్థానాలకుగాను 230 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, సీఎం పదవిని షిండేకు కాకుండా దేవేంద్ర ఫడ్నవిస్కు ఇవ్వడంపై ఆయన వర్గం నేతల్లో కూటమి వ్యతిరేకత మొదలైంది.