Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3జీ, 4జీ, 5జీ తెలుసు..! మ‌రి ‘జీరో’ జీ ఉంద‌ని తెలుసా?

3జీ, 4జీ, 5జీ తెలుసు..! మ‌రి ‘జీరో’ జీ ఉంద‌ని తెలుసా?
, బుధవారం, 14 జులై 2021 (08:25 IST)
కొన్నేండ్ల కిందటి సంగతి. సమాచార మార్పిడిని నిమిషాల్లో కొలిచిన కాలమది. ‘1జీ.. 2జీ’ అంటూ మొబైల్‌ టెక్నాలజీ బుడిబుడి అడుగులతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ‘ 3జీ ’తో వేగం పెంచుకొని, సరికొత్త సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. సెల్‌ ఫోన్‌తో దేశాన్ని డిజిటల్‌మయం చేసింది.

ఆ వెంటే వచ్చిన 4జీ అద్భుత వేగంతో మానవ జీవితాలపై తిరుగులేని ముద్ర వేసింది. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా యావత్‌ ప్రపంచాన్ని అరచేతుల్లోకి తీసుకొచ్చింది. వన్‌, టూ, త్రీ, ఫోర్‌.. అంటూ పరుగులు తీసి, ప్రస్తుతం ఐదో తరానికి చేరుకుంది. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాల్లో 5జీ ప్రభ వెలిగిపోతున్నది.

కొవిడ్‌ అడ్డు పడకపోతే మనకూ ఆ అనుభవం దక్కేది. ఈ సరికొత్త సాంకేతికత రాక ఆలస్యమైనా, రావడం మాత్రం గ్యారంటీ! అస‌లు ఇంతకీ ఈ స‌మాచార విప్ల‌వం ఎప్పుడు మొద‌లైంది.. ఎలా ఎదిగింది వంటి విష‌యాలు ఒక‌సారి చూద్దాం..
 
తొలిత‌రం (1జీ) ఎప్పుడు మొద‌లైంది?
రేడియో తరంగాల ఆధారంగా పనిచేసే మొబైల్‌ ఫోన్‌ను 1917లోనే కనిపెట్టారు. ‘సెల్‌ఫోన్‌ సాంకేతికత’ అని చెప్పుకోగలిగే తొలి తరం (1జీ) మొబైల్‌ను మాత్రం 1973లో ‘మోటరోలా’ కంపెనీ విడుదల చేసింది. దీని బరువు రెండు కిలోలు! క్రమంగా తరాలు మారడం, బటన్లు నొక్కే ఫీచర్‌ ఫోన్‌నుంచి, సకల సౌకర్యాల స్మార్ట్‌ ఫోన్‌వరకూ ఎదగడం.. అందరికీ తెలిసిందే. సెల్‌ఫోన్‌ పనితీరునుబట్టి జీఎస్‌ఎమ్‌, సీడీఎమ్‌ఏ, ఎల్టీఈ.. అంటూ రకరకాల పేర్లు అందరికీ అలవాటయ్యాయి. ఇప్పుడిక 5జీతో సమాచార విప్లవం మరో మెట్టు ఎక్కనున్నది.
 
1జీ
కదులుతూ ఫోన్‌ మాట్లాడటం వరకే ఇది పరిమితమైంది. ‘అనలాగ్‌’ సాంకేతికతతో శబ్దతరంగాలు ప్రసారమయ్యేవి. దీంతో వాటి నాణ్యతకూడా ఎగుడు దిగుడుగానే ఉండేది. ఫోన్‌ సంభాషణలకు సంబంధించిన సెక్యూరిటీకూడా తక్కువగానే ఉండేది.
 
2జీ
అనలాగ్‌ స్థానంలో డిజిటల్‌ సాంకేతికత వచ్చింది. ఫలితంగా మాటలు మెరుగ్గా వినిపించడం మొదలైంది. మొబైల్ ద్వారా ఇంటర్నెట్‌ వాడుకునే సౌలభ్యం వచ్చింది. దేశవ్యాప్తంగా రోమింగ్‌ అవకాశమూ కలిగింది. టెక్స్ మెసేజీలు పంపుకోవడం సులువైంది.
 
3జీ
మొబైల్‌ ఇంటర్నెట్‌లో వేగం పెరిగింది. వీడియో కాల్స్‌ చేసుకోవడంతోపాటు ఇంటర్నెట్‌ద్వారా ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌/ డౌన్‌లోడ్‌ చేసుకొనే సౌలభ్యం కలిగింది. ఇందుకోసం రకరకాల యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి.
 
4జీ
డేటా వేగం అమాంతం పెరిగిపోయింది. ఫోన్‌ అంటే మాట్లాడుకోవడానికే అన్న అపప్రథ చెరిగిపోయింది. వీడియో కాలింగ్‌, వీడియో స్ట్రీమింగ్‌లో నాణ్యత పెరిగింది. జీపీఎస్‌, వీడియో కాన్ఫరెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
 
5జీతో జీవితమే మారిపోతుందా?
‘4జీ కంటే 5జీ వేగం చాలాచాలా ఎక్కువ’ అని తేలిపోయింది. ఈ సామర్థ్యంతో మన చుట్టూ ఉన్న సాంకేతికతలోనూ 5జీ అనూహ్యమైన మార్పులు తీసుకురాబోతున్నది. అరచేతిలో ఇమిడిపోయే ఫోన్‌ అద్భుతాలు సాధించబోతున్నది.IoT- మన రోజువారీ జీవితాల్లో ఇంటర్నెట్‌ద్వారా పనిచేసే పరికరాల సంఖ్య పెరిగిపోతున్నది.

వీటినే ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ (IoT) అని పిలుస్తారు. చేతికుండే వాచీల దగ్గరనుంచీ ఇంట్లోని బల్బులవరకూ ఈ సాంకేతికత ఆధారంగానే పనిచేస్తున్నాయి. వీటిలో చాలా వాటికి మొబైల్‌ ఇంటర్నెట్‌ కీలకం. 4జీతో పోల్చుకుంటే 5జీతో పరికరాల అనుసంధాన సామర్థ్యం వందరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే, 5జీ సాంకేతికత ద్వారా ఒక చదరపు కిలోమీటర్‌లోని పది లక్షల పరికరాలను అనుసంధానించవచ్చు.
 
జీరో జీ గురించి తెలుసా?
మ‌రో విశేషం ఏమిటంటే వీటితో పాటు 0జీ త‌రం కూడా ఉంది. అదే రేడియో త‌రంగాల ఆధారంగా ప‌నిచేసే వైర్‌లెస్ ఫోన్లు. 1 జీ త‌ర్వాత వీటి ప్రాబ‌ల్యం త‌గ్గుతూ వ‌చ్చింది. అయితే వీటికి ఖ‌ర్చు, సాంకేతిక‌త అంత‌గా అవ‌స‌రం లేదు కాబ‌ట్టి మ‌ళ్లీ వీటికి ప్రాధాన్యం రావ‌చ్చ‌ని న‌మ్ముతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరణాలు దాచిపెడితే ఏమొస్తుంది?: సజ్జల