ఉత్తరప్రదేశ్లో డ్యూటీకి ఆలస్యంగా రావడానికి ఒక కానిస్టేబుల్ చెప్పిన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య రాత్రిపూట కలలో కనిపించడం వల్లే తాను సరిగ్గా నిద్రపోలేకపోతున్నానని, అందుకే పనికి ఆలస్యంగా వెళ్తున్నానని ఓ కానిస్టేబుల్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కానిస్టేబుల్ ప్రతిరోజూ పనికి ఆలస్యంగా వస్తున్నందుకు అతనిపై ఫిర్యాదు నమోదైంది. బెటాలియన్ ఇన్చార్జ్ దల్నాయక్ మధుసూధన్ శర్మ ఫిబ్రవరి 17, 2025న ఆ కానిస్టేబుల్కు నోటీసు పంపారు.
ఆ కానిస్టేబుల్ ఫిబ్రవరి 16, 2025 ఉదయం డ్యూటీకి ఆలస్యంగా వచ్చాడనీ, అనుచితంగా ప్రవర్తించాడనీ, తరచుగా డిపార్ట్మెంట్ కార్యకలాపాలకు హాజరు కాలేదని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇది తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన అని కూడా అధికారులు హెచ్చరించారు. దీనికి ఆ కానిస్టేబుల్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు, తన భార్యకు రాత్రిపూట గొడవలు జరుగుతాయని, దాని వల్ల నిద్రపోలేకపోతున్నామని చెప్పాడు.
అలాగే, వ్యక్తిగత సమస్యల వల్ల నేను రాత్రి నిద్రపోలేకపోయాను. ఫలితంగా, నేను ఫిబ్రవరి 16, 2025న పనికి ఆలస్యంగా వచ్చాను. తన భార్యతో తనకు తీవ్రమైన వాదన జరిగిందని, కలలో ఆమె తన ఛాతీపై కూర్చుని తనను చంపాలనే ఉద్దేశ్యంతో తన రక్తం తాగడానికి ప్రయత్నిస్తోందని అతను చెప్పాడు.
రక్తం తాగే భార్య... నిద్రరావట్లేదు. దాని వల్ల తనకు నిద్రలేమి, ఆందోళన కలుగుతోందని, నిరాశకు గురవుతున్నానని కానిస్టేబుల్ అన్నారు. దీనికోసం తాను మందులు కూడా తీసుకుంటున్నానని వివరించాడు.
తన తల్లి నాడీ సంబంధిత రుగ్మతతో బాధపడుతుందని, దీని వల్ల తాను మరింత నిరాశకు గురయ్యానని కూడా అతను వివరించాడు. తాను నిరాశకు గురయ్యానని, జీవించాలనే కోరికను కోల్పోయానని కూడా సదరు కానిస్టేబుల్ చెప్పాడు. సోషల్ మీడియాలో లేఖ ప్రచురణపై దర్యాప్తు చేస్తున్నామని 44వ బెటాలియన్ PAC కమాండెంట్ సత్యేంద్ర పటేల్ తెలిపారు.