మహిళలు పురుషులకు ధీటుగా అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో పోటీ పడుతూ.. ఇంటి బాధ్యతలే కాకుండా కార్యాలయ పనులు నిర్వర్తిస్తూ తమకంటూ గుర్తింపు సంపాదించుకుంటున్నారు. పిల్లల పెంపకంలోనూ ముందుంటున్నారు. ఎన్ని రంగాల్లో రాణించినా.. ఉన్నత స్థాయికి ఎదిగినా అమ్మతనంకు వన్నె తెచ్చే మహిళల సంఖ్య మనదేశంలోనే ఎక్కువగా వుంది.
కట్ చేస్తే.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ తన ఏడాది వయసున్న బిడ్డను ఎత్తుకుని తన విధిని నిర్వర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 15న స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది ప్రాణనష్టం, గాయాలపాలైన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటన తర్వాత, రైల్వే అధికారులు స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ భద్రతా చర్యల మధ్య, మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను ఒక చేతిలో ఎత్తుకుని, మరో చేతిలో లాఠీని పట్టుకుని ప్లాట్ఫారమ్పై గస్తీ తిరుగుతూ కనిపించింది. ఆ వీడియోలో, చల్లని పానీయం తాగుతూ రైలుకు ఆనుకుని ఉన్న ఒక వ్యక్తిని ఆమె హెచ్చరించి, అక్కడి నుండి వెళ్లిపోవాలని హెచ్చరించింది.
తరువాత ఆమె ప్లాట్ఫారమ్పై తన గస్తీని కొనసాగిస్తూ కనిపించింది.
ఆ కానిస్టేబుల్ను రీనాగా గుర్తించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వ్యక్తిగత సవాళ్లు ఉన్నప్పటికీ విధి పట్ల ఆమె నిబద్ధతను చాలామంది ప్రశంసించారు.