Publish Date: Thu, 07 Mar 2019 (16:20 IST)
Updated Date: Thu, 07 Mar 2019 (16:22 IST)
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. అసలే భారత్-పాక్ దేశాల మధ్య శాంతి భద్రతల సమస్య నెలకొని ఉంది. ఇంతలో తీవ్రవాదులు మరోసారి జమ్మూ బస్టాండ్లో భారీ పేలుడుకు కుట్రపన్నారు. బస్సులో సడెన్గా బాంబు పేల్చారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు కారణమైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇది ఉగ్రవాదుల పనేనా లేక మరేదైనా కోణం ఇందులో ఉందా అని అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా బాంబు పేలుడు ఘటనలో 18 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. బస్సుపై గ్రనేడ్ దాడి జరిగిందని జమ్మూ ఐజీ నిర్ధారించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.