బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో దశ పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ దశలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుండగా, 1302 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో సహా పలువురు మంత్రుల అదృష్టాన్ని ఓటర్లు పరీక్షించనున్నారు.
రెండో దశలో దాదాపు 3.70 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళలు. 45 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 40 వేల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పోలింగ్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నాలుగు లక్షలకుపైగా సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.
పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢీ, మధుబని, అరారియా, కిషన్గంజ్ తదితర జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో చాలావరకు సీమాంచల్ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ముస్లిం జనాభా అధికం. అత్యధికంగా హిసువా అసెంబ్లీ నియోజకవర్గంలో 3.67 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. లౌరియా, చన్పటియా, రక్సౌల్, త్రివేణిగంజ్, సుగౌలీ, బన్మన్ఖీ స్థానాల్లో అత్యధికంగా 22 మంది చొప్పున పోటీ పడుతున్నారు.
సుపౌల్ స్థానం నుంచి మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (జేడీయూ), గయా టౌన్ నుంచి మంత్రి ప్రేమ్ కుమార్ (భాజపా) వరుసగా ఎనిమిదోసారి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, మంత్రులు రేణుదేవీ, నీరజ్ కుమార్ సింగ్, లేశీ సింగ్, శీలా మండల్, జమా ఖాన్, మాజీ ఉపముఖ్యమంత్రి తార్కిశోర్ ప్రసాద్ (భాజపా), కాంగ్రెస్ బిహార్ అధ్యక్షుడు రాజేశ్ కుమార్ తమతమ స్థానాల నుంచి బరిలో దిగారు.
ఎన్డీయే కూటమిలోని హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు కేటాయించిన ఆరు సీట్లు ఇదే దశలో ఉన్నాయి. కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీకి చెందిన ఈ పార్టీ నుంచి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ నెల 6న 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 65 శాతానికిపైగా పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే.