బీహార్ ఓటర్లకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైకాపా నేతలు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ఈ విషయాన్ని బీహార్ యువత గుర్తుపెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా, బీహార్ రాష్ట్ర అభివృద్ధి కోసం మరోమారు ఎన్డీయే కూటమికి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్... అక్కడ విలేకరులతో మాట్లాడుతూ, 'బీహార్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. నీతీశ్ సర్కార్కు ముందు బీహార్లో జంగిల్రాజ్ ఉండేది. ప్రస్తుతం అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పాట్నాలో పారిశ్రామికవేత్తలతోనూ మాట్లాడాను. ఇక్కడి అభివృద్ధి పనులు, ప్రభుత్వ విధానంపై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా బీహార్కు నిధులు కేటాయించారు. బీహార్ తర్వాత ఏపీకి బడ్జెట్లో అధిక నిధులు ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమల రాకతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి.
అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మార్చడం సరికాదు. ప్రభుత్వం మారితే నష్టం జరుగుతుంది. గతంలో ఏపీలో ఒక్క ఛాన్స్ పేరుతో ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి. ఏపీలో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ యువత మేల్కోవాలి. వికాస్ భారత్ సాధించాలంటే బీహార్ అభివృద్ధి ముఖ్యం. ఇక్కడి యువత, ఓటర్లు మరోసారి ఎన్డీయేను గెలిపించాలి' అని లోకేశ్ పిలుపునిచ్చారు.