సాధారణంగా రక్త ప్రసరణ ఆగిపోతే మనిషి చనిపోయినట్టే. అయితే, ఢిల్లీ వైద్యులు మాత్రం చనిపోయిన మనిషిలోనూ రక్త ప్రసరణ ప్రారంభించారు. తద్వారా మరో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. ద్వారకలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఈ అరుదైన రికార్డును సృష్టించారు. మరణించిన ఆమె అవయవాలను దానం చేసేందుకు వీలుగా ఈ ప్రక్రియను చేపట్టినట్లు వారు వెల్లడించారు.
ఆసియా ఖండంలోనే ఈ ఘనతను సాధించిన మొదటి ఆస్పత్రి తమదేనని ఛైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా పక్షవాతం బారిన పడిన గీతా చావ్లా (55) అనే మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు నవంబరు 5వ తేదీన అమెను మణిపాల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
పరిస్థితి మరింత దిగజారడంతో నవంబరు 6వ తేదీన మరణించింది. అయితే ఆమె అవయవాలు దానం చేయాలనుకుంటున్నట్లు మృతురాలి కుటుంబం తెలియజేయడంతో అక్కడి వైద్యబృదం నార్మోథెర్మిక్ రీజినల్ పెర్ఫ్యూజన్ అనే అరుదైన ప్రక్రియను నిర్వహించింది.
ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్ను ఉపయోగించి వైద్యులు మృతురాలి ఉదర అవయవాలలో రక్త ప్రసరణను విజయవంతంగా పునఃప్రారంభించారు. అనంతరం అవయవాలు సేకరించారు. ఎన్ఆర్పీని ఉపయోగించి కాలేయం, మూత్రపిండాలను సురక్షితంగా తీసి ఇతరులకు విజయవంతంగా అమర్చినట్లు వైద్యులు పేర్కొన్నారు.
తద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచే కాకుండా ఇకపై సహజ మరణాల తర్వాత కూడా మృతుల నుంచి అవయవాలు సేకరించడం సాధ్యమేనని నిరూపించామన్నారు.