దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. పైగా, మావోయిస్టుల దాడిలో ఇకపై ఒక్క పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోవడానికీ వీల్లేదని, అందువల్ల 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోల ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు.
ఆదివారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్కౌంటరులో 31 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారి. గత కొన్ని నెలలుగా మావోలకు అపార ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఈ క్రమంలో ఆదివారం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా మరణించగా 31 మంది నక్సల్స్ చనిపోయారు. ఈ ఎన్కౌంటరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
'భారత్ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశగా భద్రతా బలగాలు బీజాపూర్లో అతి పెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్లో 31 మంది నక్సలైట్లు మరణించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి' అని అమిత్ షా సోషల్ మీడియాలో
వివరించారు.
ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందడంపై అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మానవ వ్యతిరేక నక్సలిజంను అంతమొందించడంలో ఇద్దరు ధైర్యశీలురైన జవాన్లను కోల్పోయాం అని పేర్కొన్నారు. ఇటువంటి అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. మరణించిన జవాన్లకుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అమిత్ షా వివరించారు.
అంతేకాకుండా, 2026 మార్చి 31 లోపే దేశంలో నక్సలిజంను రూపుమాపుతామని పునరుద్ఘాటించారు. తద్వారా దేశంలో ఏ పౌరుడు నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయేపరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.