Publish Date: Thu, 06 Mar 2025 (12:06 IST)
Updated Date: Thu, 06 Mar 2025 (12:13 IST)
ఖలిస్తానీ మద్దతుదారులు విదేశాలలో తమ భారత వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లండన్ పర్యటన సందర్భంగా ఖలిస్తాన్ ఉద్యమ సానుభూతిపరులు ఆయనపై దాడికి ప్రయత్నించారు. అయితే, లండన్ పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
జైశంకర్ ఐదు రోజుల పర్యటన కోసం మార్చి 4న లండన్ చేరుకున్నారు. అక్కడ చాథమ్ హౌస్లో అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత, ఆయన వేదిక నుండి బయటకు వెళుతుండగా, ఖలిస్తానీ మద్దతుదారుల బృందం ఖలిస్తాన్ జెండాలను ప్రదర్శించి, భారతదేశానికి, విదేశాంగ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది.
ఈ నిరసన సందర్భంగా, ఆ బృందంలోని ఒక వ్యక్తి భారత జాతీయ జెండాను పట్టుకుని జైశంకర్ కారు వద్దకు వచ్చి దానిని అగౌరవపరిచే విధంగా ప్రవర్తించాడు. లండన్ పోలీసులు వేగంగా స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.