Publish Date: Sun, 19 Apr 2020 (22:57 IST)
Updated Date: Sun, 19 Apr 2020 (23:00 IST)
కరోనా విపత్తును సర్వశక్తులు ఒడ్డి ఎదుర్కొంటున్న భారత్, అదే సమయంలో ఇతర దేశాలకు సాయం చేయాలన్న మానవతా దృక్పథాన్ని మరవడంలేదు.
తాజాగా భారీస్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను యూఏఈకి పంపించింది. సాధారణంగా మలేరియా చికిత్సలో వినియోగించే క్లోరోక్విన్ మాత్రలు కరోనా చికిత్సలో అమోఘంగా పనిచేస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి భారత్ పై పడింది.
ఈ క్లోరోక్విన్ వాడకంలోనూ, నిల్వల పరంగానూ భారత్ అగ్రగామిగా ఉండడమే అందుకు కారణం. అయితే భారత్ ఈ మాత్రల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను సడలించి ఉదారంగా అనేక దేశాలకు పంపిస్తోంది.
ఇప్పటికే అమెరికా, మారిషస్, సీషెల్స్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు క్వోరోక్విన్ మాత్రల ఎగుమతి జరిగింది. తాజాగా యూఏఈకి 5.5 మిలియన్ల మాత్రలను రవాణా చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక విమానం యూఏఈకి బయల్దేరినట్టు భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది.