Publish Date: Mon, 13 Apr 2020 (09:06 IST)
Updated Date: Mon, 13 Apr 2020 (09:08 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో మొన్నటి వరకు ఇటలీ తొలి స్థానంలో ఉండగా, ఇప్పుడు అమెరికా ఈ స్థానానికి ఎగబాకింది.
కరోనా మృతుల సంఖ్య సహా పాజిటివ్ కేసుల్లోనూ అమెరికా ముందు వరుసలో నిలిచింది. కొవిడ్-19 వైరస్ సోకిన వారిలో గంటకు 83 మంది చొప్పున మరణిస్తున్నట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
ఆదివారం రాత్రికి దేశవ్యాప్తంగా 21,474 మంది కరోనా కాటుతో పిట్టల్లా రాలినట్లు పేర్కొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరిలో ఒకరి మరణంతో మొదలైన మృత్యుఘోష.. శర వేగంగా ప్రజల ప్రాణాలను కబళించేస్తోందని తెలిపింది. ప్రస్తుతం 5.45 లక్షల మంది పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
కరోనాపై ఆదిలో ఉదాసీనంగా వ్యవహరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు కఠిన చర్యలకు దిగారు. దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడంతోపాటు 50 రాష్ట్రాల్లో లాక్డౌన్ను 30 వరకు పొడిగించారు. కరోనాను పెను విపత్తుగా ప్రకటించారు.