Publish Date: Thu, 09 Jan 2020 (22:10 IST)
Updated Date: Thu, 09 Jan 2020 (22:11 IST)
ప్రతి ఆరోగ్య సమస్యకు మందులు వాడడం వలన అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలా కాకుండా మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే మరియు మన ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం.
దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజూ ఉదయం మూడు కప్పుల నీళ్లలో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగాలి.
దగ్గు నుండి ఉపశమనం పొందడానికి తులసి ఆకులను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవాలి. దానిమ్మ తొక్కలను పొడి చేసి ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ కలిపి తీసుకుంటే రక్త శుద్ది జరుగుతుంది.
వెన్నునొప్పితో బాధపడేవారు నువ్వుల నూనె లేదా ఆముదంలో వెల్లుల్లి రెబ్బలు వేసి ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దనా చేయాలి. అలాగే వెన్ను నొప్పి ఉన్నచోట అల్లం పేస్టుతో మర్దనా చేసినా నొప్పి తగ్గుతుంది.
ఏదైనా గాయాలు తగిలి రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి.