Publish Date: Sat, 01 Jun 2019 (11:50 IST)
Updated Date: Sat, 01 Jun 2019 (11:51 IST)
వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. ఆలోచనా శక్తి, తెలివితేటలు కూడా మందగిస్తాయి. ఆవకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా డైట్లో తప్పకుండా ఆకుకూరలను చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.
మతిమరుపు సమస్యలు ఉత్పన్నం కాకముందే జాగ్రత్తపడటానికి ల్యూటెన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తింటే మెదడు, శరీరం రెండూ చురుగ్గా పని చేస్తాయి. పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అలాగే బ్లూ బెర్రీస్లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు కలగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి.
ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లతో పాటు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు, ఆరెంజ్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అంతేకాకుండా సాల్మన్ ఫిష్లో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడును యాక్టివ్గా, ఎనర్జిటిక్గా మార్చడంలో ఉపయోగపడతాయి. మానసిక ఆందోళనను దూరం చేయడంలో కూడా ఇవి తోడ్పడతాయి.