Publish Date: Fri, 29 May 2020 (18:16 IST)
Updated Date: Sat, 30 May 2020 (20:37 IST)
నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరిగి ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలా మంది అపోహపడతారు. దాని జోలికి వెళ్లడం మానేస్తారు. కానీ తగిన మోతాదులో తీసుకుంటే నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక టీస్పూన్ నెయ్యి త్రాగడం అలవాటు చేసుకుంటే కలిగే మంచి ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. నెయ్యి త్రాగిన తర్వాత గోరు వెచ్చటి నీళ్లు త్రాగాలి.
పరగడుపున నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి, ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీతో బాధపడేవారు దీనిని తప్పక తీసుకోవాలి. అలాగే ఈ కాలంలో కంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. నెయ్యిని తీసుకోవడం వల్ల విటమిన్ ఏ పుష్కలంగా లభించి కంటి అనారోగ్యం దూరం అవుతుంది. నిజం చెప్పాలంటే నెయ్యి తినడం వల్ల స్థూలకాయం వస్తుందనేది అపోహ మాత్రమే, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచదు, మంచి కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులను దరి చేరనివ్వకుండా కాపాడుకోవచ్చు.
గర్భిణీ స్త్రీలు కూడా నెయ్యి తీసుకుంటే అనేక ముఖ్యమైన పోషకాలు అందుతాయని నిపుణుల సూచన. కడుపులోని పిండం ఎదుగుదలకు దోహదపడుతుంది. రోజూ నెయ్యి తింటే ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు పోయి ముఖం కాంతివంతంగా వెలుగుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉండటం వల్ల గాయాలు తగిలినా, పుండ్లు ఏర్పడినా త్వరగా తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షణ ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి ఎముకల బలానికి తోడ్పడుతుంది.
ఆర్. సందీప్
Publish Date: Fri, 29 May 2020 (18:16 IST)
Updated Date: Sat, 30 May 2020 (20:37 IST)