Publish Date: Thu, 28 May 2020 (17:51 IST)
Updated Date: Fri, 29 May 2020 (18:35 IST)
తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తమలపాకుల్లో కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవీ కొలువై వుంటుందని.. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి వుంటుందని.. మధ్యలో చదువుల తల్లి సరస్వతీ దేవీ నివాసం వుంటుందని విశ్వాసం. అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి. ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా వుండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి. అలా తుంచిన ఆరు ఆకులను నెమలి ఫింఛం వలె పూజగదికి ముందున్న ఓ టేబుల్పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను వుంచి.. తుంటిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
అలా నువ్వుల నూనెలో వున్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖసంతోషాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇందుకు కారణం తమలపాకు ముగ్గురమ్మలు కొలువై వుండటమేనని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.