Publish Date: Wed, 13 Feb 2019 (12:57 IST)
Updated Date: Wed, 13 Feb 2019 (12:59 IST)
రాజకీయాల్లో శత్రువులు, మిత్రులుగా మారడం మామూలే. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎడమొహం పెడమొహంగా వుంటున్న టీడీపీ, వైకాపా ఒక్కటవుతుందట. పొత్తుపెట్టుకుంటుందని ఎవరైనా చెప్తే షాక్ కాక తప్పదు. అదీ టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకుంటాను.. అంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే.
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మోదీ సర్కారుకు వ్యతిరేకంగా... ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. దీక్షలో కూర్చున్న సందర్భంగా జాతీయ మీడియా చంద్రబాబును చుట్టేసింది. ఈ సందర్భంగా ఓ జాతీయ న్యూస్ ఛానల్తో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసిన తర్వాత వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకునేందుకు తనకెలాంటి ఇబ్బంది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒకటో రెండో సీట్లు గెలుస్తారు. ఆ తర్వాత వస్తే... తమకు మద్దతుగా నిలిస్తే.. తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని బాబు వ్యాఖ్యానించారు. ఏపీ కోసం జగన్తో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటే తప్పేముంది అంటూ బాబు ప్రశ్నించారు. అయితే బాబు వ్యాఖ్యలపై విభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రకటన చేసినా జగన్పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు ఏమాత్రం తగ్గలేదు. ఏపీకి అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మోదీ సహకరిస్తున్నారని.. తద్వారా రాష్ట్రానికి అన్యాయం చేసినట్టేనని చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని చెప్తూనే.. జగన్పై బాబు విమర్శలు గుప్పించారు.
జగన్ ఇప్పటికీ బీజేపీకి సాయం చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో జరిగిన మోదీ సభకు వచ్చిన జనాలను జగన్ తరలించారని చెప్పారు. రాష్ట్రంలో బలంలేని బీజేపీ సభకు అంత జనం వచ్చారంటే.. అంతా జగన్ సహకారమేనని బాబు ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ జగన్ను విమర్శిస్తూనే.. ఆయనతో పొత్తుకు సిద్ధమని చంద్రబాబు చేసిన ప్రకటన ప్రస్తుతం సంచలనానికి దారితీసింది.