Publish Date: Wed, 24 Dec 2025 (20:02 IST)
Updated Date: Wed, 24 Dec 2025 (20:04 IST)
ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థి ప్రాణాలను ఓ పెన్సిల్ తీసింది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో బుధవారం చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాయకన్ గూడెంలోని విహార్ అనే ఆరేళ్ళ బాలుడు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లి తిరిగి పరుగెత్తుకుంటూ వస్తుండగా, అదుపుతప్పికింద పడిపోయాడు.
ఆ సమయంలో ఆ బాలుడు చేతిలో పెన్సిల్ ఉండటంతో అది కాస్త గొంతులో గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో 108 వాహనంలో కూసుమంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ విద్యార్థి అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.