ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికర్లలో ఓ దారుణం జరిగింది. మాయ మాటలు, పెళ్లి పేరుతో ఓ యువతి మోసపోయింది. ప్రేమ పేరుతో నమ్మించిన ప్రియుడే తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వీడియో తీశామంటూ నిత్యం బెదిరిస్తూ వేధిస్తుండటంతో ఈ వేధింపులను తాళలేక బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో చోటుచేసుకుంది.
నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్, బాధితురాలి కథనం ప్రకారం.. తిరువూరుకు చెందిన యువతి (19) ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతోంది. ఓ వసతి గృహంలో ఉంటూ కళాశాలకు వచ్చి వెళుతోంది. పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. గత నెల 12న తన ఇంట్లో ఫంక్షన్ ఉందని హుస్సేన్ ఆహ్వానించడంతో వచ్చింది.
ఆ సమయంలో పరిటాలకు చెందిన పెయింటింగ్ పనిచేసే షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25)లు హుస్సేన్ ఇంటిలో ఉన్నారు. యువతి చదివే కళాశాలలోనే ప్రభుదాస్ కూడా ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అక్కడ ఫంక్షన్ జరగడంలేదని గ్రహించిన యువతి.. వారిని హుస్సేన్ను నిలదీసింది. నీతో ఒంటరిగా మాట్లాడాలని పిలిచానంటూ హుస్సేన్ నమ్మబలికాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి అతను బయటకు వెళ్లాడు.
కొద్దిసేపటికి షేక్ గాలి సైదా గదిలోకి వెళ్లి హుస్సేన్తో నువ్వు దిగిన ఫొటోలు నా వద్ద ఉన్నాయని.. వాటిని బయటపెడతానంటూ బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి అరుపులు వినిపించకుండా టీవీ పెద్ద సౌండ్తో పెట్టాడు. ఇంటి బయట హుస్సేన్, ప్రభుదాస్లు కాపలాగా ఉన్నారు.
ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే అత్యాచారానికి పాల్పడిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బాధితురాలిని ముగ్గురూ బెదిరించారు. తమతోనూ శారీరకంగా గడపాలంటూ హుస్సేన్, ప్రభుదాస్లు ఒత్తిడి చేస్తున్నారు. ఆ ముగ్గురి వేధింపులు తాళలేక యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై కేసు నమోదు చేసి, ముగ్గురినీ అరెస్టు చేశామని ఏసీపీ వెల్లడించారు.