దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండింగల్లోని ఏఆర్ డెయిరీ ఎండీ డా.రాజు రాజశేఖరన్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత వీరిని ఆదివారం రాత్రి 10.30కు రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టారు. వారికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ కేసులో ఇవే తొలి అరెస్టులు కావడం గమనార్హం. గత వైకాపా హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబరు 25న తిరుపతి తూర్పు పోలీసుస్టేషనులో కేసు నమోదైన విషయం తెల్సిందే.
దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఏపీ పోలీసు అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, ఇతర సభ్యులు.. గత మూడు రోజులుగా వైష్ణవి డెయిరీకి చెందిన డ్రైవర్లు, తితిదే సిబ్బందిని విచారించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్ జైన్, పొమిల్ జైన్, అపూర్వ చావడా, రాజు రాజశేఖరన్లను ఆదివారం విచారణకు పిలిపించి ప్రశ్నించారు. వారు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు.