హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన పెదనాన్నే లైంగికంగా వేధించాడు. దీంతో 17 యేళ్ల బాలిక ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన పోచమ్మగడ్డ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది.
పేట్ బషీరాబాద్ పోలీసులు వెల్లడించిన పోలీసుల కథనం మేరకు నిజామాబాద్ జిల్లా వర్నికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం కొంపల్లికి వలస వచ్చి నివసిస్తోంది. ఈ దంపతుల పెద్ద కుమార్తె (17) స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. గత యేడాది రోడ్డు ప్రమాదంలో ఆ బాలిక తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన జీవించివున్న సమయంలో తన అన్నతో కలిసి మేడ్చల్లో ఫైనాన్స్లో కొంత రుణం తీసుకున్నాడు.
తండ్రి మరణం తర్వాత ఆ అప్పు విషయం మాట్లాడాలనే నెపంతో పెదనాన్న తరచూ తమ్ముడి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను లైంగికంగా వేధించేవాడు. అతని వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఆ బాలిక తీవ్ర మనోవేదనకుగురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
సమచారం తెలుసుకున్న బాలిక తల్లి గుండెలవిసేలా బోరున విలపించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కేసుపో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.