తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని మలక్ పేటలో ఓ వివాహిత అనుమానస్పద రీతిలో మృతి చెందింది. కానీ అల్లుడు మాత్రం తన భార్య గుండెపోటుతో చనిపోయిందని అంటున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
మలక్ పేటలోని జమునా టవర్స్లో సింగం శిరీష, వినయ్ కుమార్ దంపతులు నివాసం వుంటున్నారు. ఐతే శిరీష్ తల్లిదండ్రులకు పిడుగు లాంటి వార్త చెప్పాడు అల్లుడు వినయ్. ఫోన్ చేసి... అత్తయ్యా.. మీ అమ్మాయి గుండెపోటుతో చనిపోయింది అని చెప్పాడు. ఈ మాట విని షాక్ తిన్న శిరీష తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరేలోపే వినయ్... భార్య శవాన్ని తన సొంత గ్రామం శ్రీశైలం లోని దోమలపెంటకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఈ విషయం తెలుసుకున్న శిరీష తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే మృతురాలి భౌతికకాయం తరలించకుండా అడ్డుకుని పరిశీలించారు. మృతురాలి శరీరంపై గాయాలు వుండటంతో... తమ అల్లుడు తమ కుమార్తెను కొట్టి చంపేసి గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.