Publish Date: Wed, 25 May 2022 (08:57 IST)
Updated Date: Wed, 25 May 2022 (08:43 IST)
పచ్చటి కోనసీమలో అగ్గి రాజుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఆందోళనకారులు మంగళవారం అమలాపురంలో తీవ్ర విధ్వంసం సృష్టించారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల ఇళ్లకు నిప్పటించారు. అయితే, ఈ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయంటూ ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఆరోపించారు.
వీటిని టీడీపీ, జనసేన పార్టీలు ఖండించారు. ఇదే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ, కోనసీమలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు.
ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.