Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం!

తెలంగాణాలో విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం!
, మంగళవారం, 23 మార్చి 2021 (10:27 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చేయిదాటిపోతోంది. దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోకుండా ఉండాలంటే పదో తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 
 
వైరస్ వ్యాప్తికి ఇవి వాహకాలుగా మారుతున్నాయని భావిస్తున్న వైద్యాధికారులు ఈ సూచన చేశారు. వైద్యశాఖ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ విషయంలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
 
కాగా, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జోరుగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నిజానికి పిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండడంతో వారికి వైరస్ సంక్రమించినా లక్షణాలు బయటపడవు. 
 
దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులకు, వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల మూసివేతే సరైన పరిష్కారమని చెబుతున్నారు.
 
మరోవైపు, రాష్ట్రంలో మళ్లీ రోజుకు 300కు పైగా కేసులు నమోదవుతుండం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఏ రకమైన స్ట్రెయినో తెలుసుకునేందుకు అధికారులు పరీక్షలు చేస్తున్నారు.
 
ఏపీలోనూ అదే పరిస్థితులు... 
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ గట్టు తెంచుకున్నట్టుగా వుంది. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ఇప్పటికే పలు విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. 
 
తాజాగా ఏపీలోనూ అదే స్థాయిలో కరోనా విజృంభణ కనిపిస్తోంది. రాజమండ్రిలోని ఓ కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం ఈ కాలేజీలో 13 కేసులు రాగా, ఆదివారం 10 కేసులు వెలుగుచూశాయి. సోమవారం నాడు ఒక్కరోజే 140 పాజిటివ్ కేసులు రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
 
దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ గౌరీనాగేశ్వరరావు స్పందిస్తూ... 700 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు జరిపామని వెల్లడించారు. పాజిటివ్ విద్యార్థులను ఒకే ప్రదేశంలో ఉంచి, ఆ ప్రదేశాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని వివరించారు. కరోనా సోకని విద్యార్థులను మరో హాస్టల్ లో ఉంచినట్టు వివరించారు.
 
కాగా, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులోని అనేక వసతిగృహాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఉస్మానియా వర్సిటీలో సైతం కరోనా ఉనికి వెల్లడైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో విద్యాసంస్థల కొనసాగింపుపై రేపు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.
 
కాగా, ఏపీలో గడచిన 24 గంటల్లో 35,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 310 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 51 కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరిలో 43, విశాఖ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
 
అదే సమయంలో 114 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 8,94,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,471 మంది కోలుకున్నారు. ఇంకా 2,382 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,191కి పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిజెపి-జనసేన పొత్తు ఎంతకాలం?