Publish Date: Tue, 01 Jun 2021 (10:44 IST)
Updated Date: Tue, 01 Jun 2021 (10:46 IST)
దేశవ్యాప్తంగా డాక్టర్లు మంగళవారం బ్లాక్ డేని పాటిస్తున్నారు. యోగా గురు రామ్దేవ్ బాబా వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక వైద్య చికిత్సలు తెలివి లేనివని, అలోపతి లక్షల మందిని చంపేసిందని రామ్దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివిధ మెడికల్ అసోసియేషన్లు నిరసన వ్యక్తం చేశాయి. రామ్దేవ్ నుంచి బేషరతు క్షమాపణలు డిమాండ్ చేశాయి.
కరోనా మహమ్మారి కంటే ఆధునిక వైద్యం వల్లే ఎక్కువ మంది చనిపోయారని రామ్దేవ్ అనడం తీవ్ర ఆక్షేపణీయం అని ఈ అసోసియేషన్లు అంటున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా ఎలాంటి చర్య తీసుకోలేదని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎఫ్ఓఆర్డీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది.
అందుకే జూన్ 1ని బ్లాక్ డేగా పాటిస్తున్నాం. దేశవ్యాప్తంగా వైద్య సేవలకు అంతరాయం కలగకుండా పని చేసే చోటే నిరసన తెలపాలని నిర్ణయించాం. రామ్దేవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఆయనపై మహమ్మారి వ్యాధుల చట్టం, 1987 ప్రకారం చర్యలు తీసుకోవాలి అని ఈ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ నిరసనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది. గతవారం రామ్దేవ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్గా మారింది. అలోపతీ మందుల వల్లే లక్షల మంది చనిపోయారు. కరోనా కంటే కూడా ఇలా చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ అని రామ్దేవ్ అన్నారు.
అయితే ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆధునిక వైద్యాన్ని తక్కువ చేసే ఆలోచన ఆయనకు లేదని రామ్దేవ్కు చెందిన పతంజలి గ్రూప్ వివరణ ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోపాటు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నుంచి కూడా లేఖ రావడంతో రామ్దేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు