Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరీంనగర్‌లో కరోనా కలకలం : 13 మందిలో వైరస్ లక్షణాలు

కరీంనగర్‌లో కరోనా కలకలం : 13 మందిలో వైరస్ లక్షణాలు
, సోమవారం, 16 మార్చి 2020 (14:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మొత్తం 13 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో జిల్లా వాసులు హడలిపోతున్నారు. ఇండోనేషియాకు చెందిన పది మందితో సహా ముగ్గురు స్థానికులు కలిసి మొత్తం 13 మంది ఇటీవల కరీంనగర్‌కు వచ్చారు. వీరందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయగా, వారిలో కరనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో 13 మందిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 
 
కాగా, తెలంగాణలో మూడో కరోనా కేసు నమోదైంది. నెదర్లాండ్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన రంగారెడ్డి జిల్లావాసిలో కరోనాను నిర్ధారిస్తూ పుణె ల్యాబ్‌ ఫలితాలను వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరికి నిర్వహించిన పరీక్షల్లో వైరస్‌ అనుమానిత లక్షణాలు వెల్లడవ్వడంతో.. ఇప్పటివరకూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు ఇటీవల గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా అనుమానితులు 22 మంది కొత్తగా ఆసుపత్రుల్లో చేరగా.. వీరి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. 
 
నిజానికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదు. కానీ, కేంద్రం మాత్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఫలితంగా తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఇప్పటికే 15 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, సినిమా హాళ్లు, పబ్బులు, బార్లు బంద్ చేయించింది. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే సర్కార్ అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. 
 
అందులో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. పాజిటివ్ అని తేలితే.. ఐసోలేషన్ వార్డుకు తరలించి వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునే వరకూ చికిత్స చేయించాలని నిర్ణయించుకుంది. ఇక రాష్ట్రంలో ఒక డెత్ కేసు లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వం.. దీని కోసం గాంధీ ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది. 
 
అదేసమయంలో అంతర్జాతీయ విమానాల్లో రాష్ట్రానికి వస్తున్న ప్రతి ఒక్కరి సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ సేకరిస్తోంది. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్‌ అధికారుల సహకారం తీసుకుంటుంది. పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడూ స్కానింగ్‌ చేసి ఆరోగ్యశాఖ అంతర్గత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. సమాచార డిజిలీకరణ ద్వారా ఏ జిల్లాలో, ఏ ఊళ్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులున్నారనే సమాచారం అన్ని జిల్లాల వైద్యాధికారుల వద్ద ఉంటుంది. ఈ సమాచారం ప్రాతిపదికన అంతర్జాతీయ ప్రయాణికుల నివాసిత ప్రాంతాలను గుర్తించడం తేలికవుతుంది. ముందే సేకరించిన సమాచారం ఆధారంగా వారి నివాసిత ప్రాంతాలను గుర్తించి, ఇంటికెళ్లి వారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావోడికి కోపం వచ్చింది.. గవర్నర్ - ఎస్ఈసీలను వద్దంటారేమో? : జేసీ వ్యంగ్యాస్త్రాలు