Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు

ఏపీలో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు
, సోమవారం, 31 మే 2021 (17:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. ఇటీవల వరకు ఉద్ధృతస్థాయిలో వ్యాపించిన కరోనా వైరస్ ఇపుడు కాస్త నెమ్మదించింది. ఫలితంగా రెండు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య పదివేలకు లోపు నమోదయ్యాయి. 
 
గత 24 గంటల్లో 83,461 కరోనా పరీక్షలు నిర్వహించగా కేవలం 7,943 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి (1,877), చిత్తూరు (1,283) జిల్లాలను మినహాయిస్తే, మిగతా అన్ని జిల్లాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 231 కేసులు గుర్తించారు.
 
మరోవైపు, 19,845 మంది కరోనా నుంచి కోలుకోగా, 98 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 10 మంది మృతి చెందారు. 
 
దాంతో మొత్తం మరణాల సంఖ్య 10,930కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,93,085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకినవారిలో 15,28,360 మంది కోలుకోగా, ఇంకా 1,53,795 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఔషధం పంపిణీకి ఏపీ హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ జరుగగా, హైకోర్టు ఇరు వర్గాల వాదనలు ఆలకించి అనుమతి ఇచ్చింది. 
 
ఆనందయ్య మందును పంపిణీ చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కంట్లో వేసే చుక్కల మందుపై గురువారంలోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకా కార్యక్రమం ప్రారంభించిన వేదాంత