ప్రపంచ వ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దీంతో అనేక మంది టెక్కీలు ఉపాధిని కోల్పోతున్నారు. తాజాగా దేశంలోని అతిపెద్ద టెక్ కంపెనీగా గుర్తింపు పొందిన టీసీఎస్ ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్రం కూడా దృష్టిసారించింది. టీసీఎస్ ఉద్యోగాల కోత పరిస్థితిని కేంద్రం ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కంపెనీ విషయంలో టెక్ కంపెనీలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపాయి.
టీసీఎస్లో భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్టు ఆ సంస్థ సీఈవో కె.కృతివాసన్ ఆదివారం ప్రకటన చేసిన విషయం తెల్సిందే. దాదాపు 12 వేలకు పైగా ఉద్యోగాలను తొలగించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఉపాధి వృద్ధి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాల వంట కార్యక్రమాలతో ఉద్యోగ అవకాశాలను ఎలా పెంచవచ్చనే దానిపై ప్రభుత్వం దృష్టిసారించిందని పేర్కొన్నాయి. నైపుణ్య శిక్షణ, పునఃనైపుణ్య శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఉద్యోగాల కోత అంశంపై టీసీఎస్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను గుర్తించేందుకు లోతుగా అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది.