Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

Advertiesment
Israel-Iran war

ఠాగూర్

, సోమవారం, 16 జూన్ 2025 (09:22 IST)
ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. గత రెండు రోజులుగా సాగుతున్న భీకర దాడుల్లో ఇప్పటివరకు 224 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 90 మందికిపైగా సాధారణ పౌరులు ఉన్నట్టు ఇరాన్ వెల్లడించింది. జూన్ 13వ తేదీ నుంచి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఈ దాడులు సాగుతున్నాయి. ఇరాన్ సైనిక దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ సహ పలువురు సైనిక ఉన్నతాధికారులు కూడ ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 
 
'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఈ నెల 13న ఇజ్రాయెల్ ఈ దాడులను ప్రారంభించింది. ఇరాన్‌లోని 12కు పైగా ప్రాంతాల్లో సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని సమాచారం. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ - సయీద్ ఇరవానీ భద్రతా మండలిలో ప్రసంగిస్తూ, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ దాడుల వలన 224 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 329 మందికి పైగా గాయపడ్డారని ఆయన తెలిపారు.
 
ఈ దాడుల్లో పలువురు ఇరాన్ ఉన్నత సైనిక అధికారులు కూడా మరణించారు. ఇరానియన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ బాఘేరి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్డీసీ)కు చెందిన పలువురు సీనియర్ కమాండర్లు, ఐఆర్డీసీ వాయు రక్షణ, డ్రోన్ విభాగాల నాయకులు మృతి చెందిన వారిలో ఉన్నారని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఐఆర్ సీ ఏరోస్పేస్ దళానికి చెందిన కీలక నాయకత్వం అంతా ఒక భూగర్భ కమాండ్ సెంటరులో ఉండగా, దానిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని, ఫలితంగా వారంతా మరణించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది.
 
ముఖ్యంగా సాధారణ పౌరుల మరణాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే ఈ దాడులను ఆపి, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించాలని, మధ్యవర్తిత్వ ప్రయత్నాలను పునరుద్ధరించాలని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. కొనసాగుతున్న ఈ ఘర్షణలు కేవలం ఇరాన్‌ను మాత్రమే కాకుండా, యావత్ మధ్యప్రాచ్యాన్ని అస్థిరపరిచే ప్రమాదం ఉందని, శాంతియుత పరిష్కార యత్నాలకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్