కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్రవాహన ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా దేశంలో అమ్ముడయ్యే అన్ని టూవీవర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ - ఏబీఎస్ను తప్పనిసరి చేసయనుంది. ఈ మేరకు త్వరలోనే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశీయంగా అమ్ముడుపోతున్న 150 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన టూవీలర్లకే ఏబీఎస్ తప్పనిసరి అనే నిబంధన అమలవుతోంది. ఇకపై ఎంట్రీ లెవల్ మోడళ్లు సహా అన్ని దిచక్రవాహనాలకు దీన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో మొత్తం ఎంట్రీ లెవల్ మోడళ్లే దాదాపు 75 శాతం మేరకు ఉన్నాయి. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం వరకు టూవీలర్ల కారణంగా జరిగినట్టు కేంద్ర రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
కాగా, ఏబీఎస్ నిబంధన అమల్లోకి వస్తే అన్ని రకాల ద్విచక్రవాహనాల ధరలు పెరగనున్నాయి. ఏబీఎస్ను అమర్చడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులకే బదిలీ చేస్తాయి. దీనివల్ల ఎంట్రీ లెవల్ టూవీలర్ మోడళ్ల ధరలు రూ.2500 నుంచి రూ.5 వేల వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రమాదాలను అడ్డుకోవడంలో ఏబీఎస్ ఎంత మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.
ఏబీఎస్ - యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్.. అంటే వాహనాల్లో ఉపయోగించే ఒక భద్రతా వ్యవస్థ. సడన్ బ్రేక్ సమయంలో చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. దీనివల్ల డ్రైవర్కు వాహనం మీద నియంత్రణ ఉంటుంది. వాహనం స్కిడ్ కాకుండా నివారిస్తుంది.