హీరోలు సినిమాల్లో చెప్పే డైలాగులు థియేటర్లకే బాగుంటాయని, బాహ్య ప్రపంచంలో వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యంకాదని సినీ హీరో, జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అప్రజాస్వామిక ధోరణితో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జగన్ సినిమా డైలాగులు చెబుతూ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని, వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘీక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందేనన్నారు.
దీనిపై పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని హెచ్చరించారు. రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామన్నారు. చట్టవిరుద్దంగా ప్రవర్తించేవారిని, బహిరంగంగా ప్రదర్శలు చేసేవారిని కట్టడి చేయాలని, కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడేవారి నేర ఆలోచనను ప్రజలంతా గమనించాలని కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అనే విషయాన్ని మరిచిపోవద్దని ఆయన అన్నారు.