Publish Date: Fri, 08 Apr 2022 (10:50 IST)
Updated Date: Fri, 08 Apr 2022 (10:56 IST)
వేసవిలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో దాహార్తి కోసం ప్రజలు కొబ్బరినీళ్లు, నిమ్మకాయలను విపరీతంగా వాడుతున్నారు. దీంతో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిపోయింది.
ఇప్పటికే వేసవి ఎండల ధాటికి ఇప్పటికే కూరగాయల ధరలు మండిపోతుండగా.. ఇప్పుడు నిమ్మకాయల ధరలకు కూడా అమాంతం రెక్కలొచ్చాయి. యాపిల్ పండ్ల ధరకు పోటీగా నిమ్మకాయలను విక్రయిస్తున్నారు.
దీంతో గత వారం రోజులుగా నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటడంతో హైదరాబాద్ నగరంలో ఒక్క నిమ్మకాయను రూ.10కు విక్రయిస్తున్నారు.
నిమ్మకాయ ధర పెరగడంపై అమ్మకపుదారులు ఆందోళన వ్యక్తం చేశారు, వినియోగదారులు సిట్రస్ పండ్లను ఇంత ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేరని చెప్పారు.
పెరిగిన ధరలపై వెండర్లు ఏమంటున్నారంటే.. రూ.700 లకు ఓ బస్తా నిమ్మకాయలను కొనేవాళ్లమని.. ప్రస్తుతం ఆ ధర కాస్త రూ.3,500లకు పెరిగిందని చెప్తున్నారు.
అలాగే ఒక బస్తా నిమ్మకాయలను రూ.3,000కు కొనుగోలు చేస్తున్నట్లు లక్ష్మి అనే మహిళా వెండర్ తెలిపింది. డజను నిమ్మకాలను రూ.120లకు అమ్మాను. కానీ ఎవరూ కొనడానికి సిద్ధంగా లేరు. ఆకుపచ్చ నిమ్మకాయలను రెండు రోజుల తరువాత కూడా విక్రయించవచ్చు, కానీ పసుపు నిమ్మకాయలు కుళ్లిపోయినందున వెంటనే వాటిని విక్రయించాల్సి ఉంటుంది. ఇంత ఎక్కువ ధరకు నిమ్మకాయను ఎవరూ కొనడం లేదని వాపోయింది.