స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణగ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహ రుణాలకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఇది సమాన నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) చెల్లించే కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తుంది. బ్యాంక్ తన ఎక్స్టర్నల్ బెంచ్మార్క్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)లను సవరించింది.
ఈ నెల 15 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయం రుణగ్రహీతలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25%కి తగ్గించాలనే నిర్ణయం తర్వాత ఈ చర్య తీసుకోవడం జరిగింది.
ఇందులో భాగంగా ఎస్బీఐ రుణ రేట్లను సర్దుబాటు చేసినట్లు స్పష్టం చేసింది. అయితే, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) లేదా బేస్ రేట్ (బీపీఎల్ఆర్)లో ఎటువంటి మార్పులు ఉండవని బ్యాంక్ ధృవీకరించింది.