Publish Date: Sat, 05 Jun 2021 (08:15 IST)
Updated Date: Sat, 05 Jun 2021 (08:17 IST)
గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పడిపోవడంతో ధరలు నేలచూపుచూస్తున్నాయి.
దేశరాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.390 తగ్గి రూ.48 వేల దిగువకు చేరుకుంది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.47,910 వద్ద నిలిచింది. గడిచిన వారం రోజుల్లో బంగారం రూ.2 వేలకు పైగా తగ్గినట్లు అయింది.
అదేవిధంగా హైదరాబాద్లో తులం పసిడి ధర రూ.760 తగ్గి రూ.49,640 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్ల ధర రూ.45,500గా ఉన్నది. కిలో వెండి ఏకంగా రూ.2 వేలు తగ్గి రూ.75,500 నిలిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటంతో అనూహ్యంగా డాలర్కు డిమాండ్ నెలకొంది. దీంతో బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.