Publish Date: Sat, 21 Aug 2021 (09:27 IST)
Updated Date: Sat, 21 Aug 2021 (09:44 IST)
వంట గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కరోనాతో కుదేలైన సామాన్యులకు... రోజురోజుకు పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ ధరలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెరుగుతున్న గ్యాస్ బండ ధరలు...మధ్యతరగతి వర్గాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే... సిలిండర్ ధర 265 రూపాయలకు పైగా పెరగటం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు నాలుగు నెలల కాలంలోనే ఐదు సార్లు గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి.
పెరిగిన వంటగ్యాస్ ధరలతో తెలంగాణలో వినియోగదారులపై సుమారు 150 కోట్ల రూపాయలకుపైగా అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.10 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. నెలకు సగటున 65 నుంచి 70 లక్షల సిలిండర్లను.. మూడు చమురు సంస్థలు వినియోగదారులకు అందిస్తున్నాయి.
ఏప్రిల్ నెలలో సిలిండరుపై10 రూపాయలు తగ్గించింది. కరోనా సమయంలో వాణిజ్య వినియోగం తగ్గినప్పటికీ గృహావసరాల సిలిండర్ల వినియోగం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.