Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మీద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌.. ఏ తుపాకీతో కాల్చారనే అంశాలపై ఎన్‌హెచ్ఆర్‌సీ దృష్టి - ప్రెస్ రివ్యూ

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మీద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌.. ఏ తుపాకీతో కాల్చారనే అంశాలపై ఎన్‌హెచ్ఆర్‌సీ దృష్టి - ప్రెస్ రివ్యూ
, సోమవారం, 9 డిశెంబరు 2019 (16:38 IST)
హైదరాబాద్ యువతి దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సభ్యుల బృందం విచారణ ముమ్మరం చేసిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
 
ఆ కథనం ప్రకారం.. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకుంది. దిశను దహనం చేసిన ప్రాంతం నుంచి ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం వరకు తొలుత పరిశీలించారు. ఇంతదూరం నిందితులు ఎలా వచ్చారు? అంతా ఒకే దగ్గర ఎలా పడిపోయారు? నిందితుల శరీరంలో ఎలాంటి బుల్లెట్లు ఎందుకు లేవు? అనే అంశాలపై సభ్యులు దృష్టిసారించినట్లు సమాచారం.
 
నిందితులను పోలీసులు ఏ రకం తుపాకీతో కాల్చారు? పిస్టల్స్‌తోనా? పెద్ద గన్స్‌ వాడారా? పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు? ఇద్దరు నిందితులు తొలుత ఫైర్‌ ఓపెన్‌ చేస్తే.. పోలీసులు నలుగురిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది? అనే విషయాలపై ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం.
 
అయితే మృతుల శరీరంలో బుల్లెట్లు లేకపోవడంపై ఓ పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్‌లో శరీరంలో నుంచి తూటాలు దూసుకుపోవడం సాధారణ విషయమేనని తెలిపారు. ఎముకలు, పక్కటెముకలకు తగిలినపుడు తూటాల దిశ మారుతుందని, మెత్తని శరీరభాగాలకు తగిలినప్పుడు ఇలా బయటికి వస్తుంటాయని వివరించారు.
 
ఎన్‌కౌంటర్‌లో నిందితులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులు ఏ రకానికి చెందినవి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసుల వద్ద 9 ఎంఎం పిస్టల్, ఎస్‌ఎల్‌ఆర్‌ (సెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిల్‌) ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితులను పోలీసులు ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులతోనే కాల్చా రు.
 
ఇదిలావుంటే.. దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఆదివారం ఉదయం చటాన్‌పల్లి వద్ద పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. ఘటనా స్థలాలను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ఇప్పటికే పరిశీలించారు. మరోమారు ఈ బృందం ఘటనా స్థలానికి వచ్చి ఎన్‌కౌంటర్‌ గురించి అడిగితే చూపించడానికి పోలీసులు ఆదివారం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు.
 
హంతకులు పోలీసులపై ఏవిధంగా తిరగబడ్డారు? ఏవిధంగా రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు? ఏవిధంగా పోలీసులు, హంతకులపై కాల్పులు జరిగాయి? అనే వాటిపై పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. దీనిని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. అయితే, ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం మళ్లీ సంఘటనా స్థలానికి వస్తుందా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ యవతితో నిశ్చితార్థం.. మరో యువతితో పెళ్లి.. వరుడు గుర్రమెక్కుతుండగా...