Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ లాక్‌డౌన్: క్వారంటైన్ కేంద్రాల నుంచి పారిపోతున్న వలస కార్మికులు

కరోనావైరస్ లాక్‌డౌన్: క్వారంటైన్ కేంద్రాల నుంచి పారిపోతున్న వలస కార్మికులు
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:41 IST)
దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించిన తర్వాత స్వగ్రామాలకు వెళ్లిన వేలాది మంది వలస కార్మికులు క్వారంటైన్ సెంటర్ల నుంచి పారిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల్ని, గ్రామ కౌన్సిల్ భవనాలలో వేలాది క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే చాలా కేంద్రాలలో కనీస సౌకర్యాల కొరత ఉంది.

 
బీహార్లో కొన్ని కేంద్రాలలో కొంత మంది రాత్రి పూట బయటకి వెళ్ళిపోయి, మళ్ళీ భోజనం కోసం పగలు తిరిగి వస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ 35 కోట్ల జనాభాతో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో గనక ఒకవేళ వైరస్ ప్రబలితే పెద్ద విపత్తుకి దారి తీస్తుంది.

 
ప్రజలు గ్రామాలకి ఎందుకు వెళ్లారు?
ఈ రాష్ట్రాలలో ఉండే లక్షలాది మంది ప్రజలు పనుల కోసం దిల్లీ, ముంబై, కోల్కతా లాంటి నగరాలకు వలస వెళతారు. చాలా మంది గుజరాత్ లో ఉండే డైమండ్, వస్త్ర పరిశ్రమల్లో పని చేయడానికి కూడా వెళతారు. భారత ప్రధాని మోదీ మార్చ్ 24 వ తేదీన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించిన వెంటనే వేలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు ప్రయాణమయ్యారు.ఇలా వచ్చిన వారందరిని 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేశాయ.

 
గ్రామంలో పాఠశాలల్ని, గ్రామ సభ భవనాలని క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. కొవిడ్-19 పరీక్షలు నిర్వహించిన తర్వాత చాలా మందిని ఇంటికి పంపేశారు.

 
ఈ కేంద్రాలలో ఏమి జరుగుతుంది?
క్వారంటైన్ కేంద్రాలలో పెట్టిన కొంత మంది ప్రజలు వారి గ్రామాలకి వెళ్ళిపోతే, కొంత మంది బయటకి వెళ్లడం, తిరిగి రావడం లాంటి పనులు చేస్తున్నారని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. నేను మాట్లాడిన రిపోర్టర్లు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

 
బాబు పత్తి గ్రామానికి చెందిన ఐదుగురు కార్మికులు స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి వెళ్లకుండా గ్రామంలోకి వచ్చేశారని ప్రతాప్ఘర్‌లో ఒక స్థానిక పాత్రకారుడు అమితేన్ద్రా శ్రీవాస్తవ చెప్పారు.ఈ విషయాన్ని చెప్పడానికి గ్రామస్థులు పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, దాంతో తాను పై అధికారులు, వైద్య అధికారులతో మాట్లాడి సమాచారం అందించానని చెప్పారు. సమాచారం అందించిన 30 గంటల తర్వాత ఒక వైద్య బృందం వచ్చి వారికి పరీక్షలు నిర్వహించింది. కానీ, వారిని ఇంటి వద్దనే ఉండమని చెప్పారు.

 
క్వారంటైన్ కేంద్రాలలో వారిని ఉంచే బాధ్యత ఎవరిది?
క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న వారిని పర్యవేక్షించే బాధ్యత గ్రామ అధికారికి ఇచ్చినప్పటికీ ,సెంటర్ల నుంచి వెళ్ళిపోతున్నవారిని ఆపడానికి, పోలీసులు గాని, భద్రతా సిబ్బంది గాని లేరని, బీబీసీ ఫ్రీలాన్స్ ప్రతినిధి సమీరాత్మజ మిశ్ర చెప్పారు. ఈ సంవత్సరం చివర్లో జరగనున్న గ్రామ సభల ఎన్నికల దృష్ట్యా గ్రామాధికారులెవరూ గ్రామస్థులకు వ్యతిరేకంగా వ్యవహరించే ధైర్యం చేయలేకపోతున్నారు.

 
గత వారంలో క్వారంటైన్ కేంద్రాల నుంచి చాలా మంది తప్పించుకుని పారిపోతున్నారన్న వార్తలు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ ,ఎవరైనా పారిపోతే పోలీస్ అధికారులను బాధ్యులని చేస్తామని హెచ్చరించారు. అప్పటి నుంచి అలా పారిపోయిన వారిని పట్టుకుని వారి పై కేసు లు నమోదు చేస్తున్నారు.అయితే ఈ సమస్య ఆగలేదు.బీహార్ లో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కనీసం 1,80,000 మంది వలస కార్మికులు తిరిగి వచ్చారని అందులో 27000 మందిని క్వారంటైన్ లో పెట్టినట్లు అధికారులు చెప్పారు.

 
కానీ, కరోనా వైరస్ సోకిందన్న అనుమానితులు పక్క వారికి వ్యాపింపచేస్తామేమోననే భయంతో పారిపోతున్నట్లు కొన్ని కధనాలు వచ్చాయి,చాలా మంది రాత్రి పూట ఇంటికి వెళ్ళిపోయి, కేంద్రాలలో ఉచితంగా లభించే భోజనం కోసం తిరిగి పగలు వస్తున్నారని, కొంత మంది గ్రామాధికారులు చెప్పారు.

 
ఇక్కడి నుంచి ప్రజలు ఎందుకు పారిపోతున్నారు?
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్లో రెండు రోజుల క్రితం క్వారంటైన్ లో పెట్టిన 16 మంది కిటికీ పగలగొట్టి పారిపోయారు.ఇందులో ఒక మహిళ ఆమె పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు చేసిన వీడియో లో క్వారంటైన్ కేంద్రాలలో వాళ్లకి ఆహారం లభించటం లేదని ఫిర్యాదు చేశారు. అయితే వీరిని తిరిగి పట్టుకుని మళ్ళీ కేంద్రాలలో నిర్బంధించారు.

 
క్వారంటైన్ కేంద్రాల నుంచి వెళ్లిపోయిన కొందరు కేంద్రాలు కిక్కిరిసి, కనీస సౌకర్యాలు లేకుండా ఉంటున్నాయని చెప్పారు. కొందరు భోజనం దొరకటం లేదని చెబితే, కొందరు, సబ్బు, శానిటైజేర్ లేవని, కొందరు దోమలు ఎక్కువగా ఉన్నాయని, కొంత మంది టాయిలెట్లు శుభ్రంగా లేవని ఫిర్యాదు చేశారు.

 
ఈ కేంద్రాలలో కనీస సౌకర్యాలైన విద్యుత్, టాయిలెట్లు, పడుకోవడానికి పడకలు కూడా లేవని అమర్నాథ్ తివారీ అనే ది హిందూ జర్నలిస్ట్ చెప్పారు. ఆయన తన కధనం కోసం చాలా మంది గ్రామస్థులతో మాట్లాడారు. సాయంత్రం అయితే గుంపుల కొలదీ దోమలు ఈ కేంద్రాల చుట్టూ చుట్టుముడతాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని అక్కడ ఉండమని కూడా గట్టిగా చెప్పలేకపోతున్నామని కొంత మంది గ్రామాధికారులు చెప్పారు.

 
అయితే, వీరు స్వేచ్ఛగా తిరగడం వలన వైరస్ ఎవరిద్వారానైనా వ్యాప్తి చెందుతుందేమో ననే భయం గ్రామస్థులని వెంటాడుతోంది. "మా గ్రామంలో చాలా మంది వలస కార్మికులు గుజరాత్, దిల్లీ నుంచి తిరిగి వచ్చారు. వాళ్ళు అసలు క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లనే లేదు. ఇక్కడ బయట వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని", మనోజ్ అనే పాట్నా నివాసి నాకు ఫోన్లో చెప్పారు.

 
"ఇక్కడ ఎవరూ సామాజిక దూరం పాటించటం లేదు. బ్యాంకులు, మార్కెట్లు అన్నీ రద్దీగా ఉంటున్నాయి. పిచ్చిగా జనం గుమిగూడుతున్నారు. ఈ పరిస్థితిని అధికారులు కూడా నియంత్రించలేకపోతున్నారని" చెప్పారు. "ఒక వేళ మేము బ్రతికి ఉన్నామంటే అది మేము తీసుకుంటున్న జాగ్రత్తల వలనే కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన మాత్రం కాదు".

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్లో కరోనా కంటెన్న్మెంట్ లో మంత్రి కేటీఆర్