Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్: ముంచుకొస్తున్న ఈ సునామీ నుంచి భారత్ తప్పించుకోగలదా?

కరోనా వైరస్: ముంచుకొస్తున్న ఈ సునామీ నుంచి భారత్ తప్పించుకోగలదా?
, ఆదివారం, 22 మార్చి 2020 (18:54 IST)
ప్రపంచవ్యాప్తంగా 184 దేశాలు కరోనావైరస్ కబంధ హస్తాల్లో విలవిల్లాడుతున్నాయి. ఇప్పటివరకూ ఈ వైరస్ సోకినవారి సంఖ్య 2,60,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వల్ల చనిపోయినవారి సంఖ్య 11 వేలు దాటింది. ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ వల్ల అత్యంత ప్రభావితమయ్యే తర్వాత దేశం భారత్ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

 
భారత్‌లో ఇప్పటివరకూ 340కి పైగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకూ ఆరుగురు మృతిచెందారు. మొదటి మృతి కర్ణాటక, రెండోది దిల్లీ, మూడోది మహారాష్ట్ర, నాలుగోది పంజాబ్‌, ఐదోది మహారాష్ట్ర, ఆరోది బిహార్‌లో సంభవించింది. సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ డైరెక్టర్ డాక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ్ బీబీసీ ప్రతినిధి రజినీ వైద్యనాధన్‌తో కరోనావైరస్ గురించి మాట్లాడారు.

 
భారత్ కరోనా వైరస్ సునామీకి సిద్ధంగా ఉండాలని డాక్టర్ రమణన్ హెచ్చరించారు. భారత్‌లో కరోనావైరస్ కేసులు మరింత వేగంగా పెరుగుతాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. మిగతా ప్రపంచంతో పోలిస్తే భారత్‌లో దాని ప్రభావం తక్కువగా ఉంటుందనడానికి ఎలాంటి సంకేతాలూ లేవన్నారు.

 
అయితే కరోనావైరస్ వ్యాపించకుండా అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. "ఈ విషయంలో భారత ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం స్పందన అద్భుతంగా ఉంది. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉండడానికి అదే కారణం" అని డబ్ల్యుహెచ్ఓ ప్రతినిధి హాంగ్ బెకెడమ్ అన్నారు.

 
భారత్‌లో రోగుల సంఖ్య పెరగవచ్చు
"మిగతా దేశాలతో పోలిస్తే మనం కాస్త వెనకే ఉండవచ్చు. కానీ ఇక్కడ స్పెయిన్, చైనా లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఎంత వేగంగా జనం ఇన్ఫెక్షన్‌కు గురయ్యారో.. అలాంటి పరిస్థితులే ఇక్కడ కూడా వస్తాయి. కొన్ని నెలల్లో మనం కరోనా సునామీ కోసం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది" అని రమణన్ అన్నారు.

 
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారత్‌లో ప్రస్తుతానికి చాలా తక్కువ ఉన్నాయి. ప్రపంచంలోని ఎక్కువ దేశాలు దారుణంగా కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుంటే, భారత్‌లో ఆ కేసులు తక్కువగా ఎందుకు ఉన్నాయి? "మనం ఎక్కువమందికి టెస్టులు చేసుంటే, ఇప్పటికే మరిన్ని కేసులు బయటపడి ఉండేవి. కానీ భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ టెస్టులు చాలా తక్కువగా జరుగుతున్నాయి" అని ఈ ప్రశ్నకు రమణన్ చెప్పారు.

 
"మరో రెండు మూడు రోజుల్లో ఎక్కువ మందిని టెస్ట్ చేస్తే, రోగుల సంఖ్య కూడా పెరుగుతుందని నాకు అనిపిస్తోంది. ఆ సంఖ్య వేలల్లో కూడా ఉండవచ్చు. అందుకే, మనం సిద్ధగా ఉండాలి. భారత్‌లో ఇలాంటి ఇన్ఫెక్షన్ వ్యాపించడం చాలా సులభం. దానికి కారణం ఇక్కడి జన సాంద్రత. చైనాలో కూడా అదే జరిగింది" అని రమణన్ చెప్పారు. కరోనావైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఇప్పుడు వేగంగా పెరుగుతోందని ఆయన భావిస్తున్నారు. ప్రతి పాజిటివ్ కేసు రెండు కొత్త కేసులను పెంచుతోందన్నారు.

 
ఎంతమందికి వ్యాపించవచ్చు?
"కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఇన్ఫెక్షన్ వ్యాపించడం అనేది మూడో దశ, ఇది కాస్త ప్రమాదకరమైన స్థాయి. కమ్యూనిటీ ట్రాన్స్‌‌మిషన్ అంటే వైరస్ సోకిన వ్యక్తిని కలవకపోయినా, కరోనావైరస్ వ్యాపించిన దేశాల్లో పర్యటించకపోయినా ఓ వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ రావడం".

 
"భారత్‌లో ఇప్పటివరకూ ఎక్కువగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు లేదా విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసినవారికి మాత్రమే కరోనావైరస్ టెస్టులు చేశారు. కానీ కరోనావైరస్ ఉన్న వ్యక్తిని కలిశాననే విషయమే ఒక వ్యక్తికి తెలీనపుడు, అతడి ద్వారా కరోనా మిగతా చాలా మందికి వ్యాపిస్తే, మరింత ఆందోళనకర పరిస్థితి ఏర్పడుతుంది" అని ఆయనన్నారు.

 
భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఎన్ని బయటపడొచ్చు?
దీనిపై డాక్టర్ రమణన్... "అమెరికా, బ్రిటన్‌లలో 20 నుంచి 60 శాతం జనం ఇన్ఫెక్షన్‌కు గురై ఉంటారు. అలాగే, ఒక అంచనా ప్రకారం, కనీస గణాంకాల విషయానికి వస్తే భారత్‌లో దాదాపు 20 శాతం జనాభా వైరస్ గుప్పిట్లో చిక్కుకుంటుంది. కానీ ఆ సంఖ్య తక్కువేం కాదు. 20 శాతం జనాభా అంటే దాదాపు 30 కోట్ల మంది దానికి గురవుతారు" అన్నారు.

 
ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది?
"ప్రతి ఐదుగురిలో ఒకరికి, అంటే 40 నుంచి 50 లక్షల మందికి ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. వారిని ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ, భారత ఆరోగ్య సేవలు అంత భారీ స్థాయిలో, ముఖ్యంగా జిల్లా స్థాయి ఆస్పత్రులు అత్యంత ఘోర స్థితిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన చికిత్స సదుపాయాలు అందించగలదా? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది" అని రమణన్ అన్నారు.

 
భారత్‌లో మెరుగైన ఆరోగ్య సదుపాయాలు లేవని, ఇక్కడ ఆస్పత్రుల పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదని డాక్టర్ రమణన్ భావిస్తున్నారు. "దేశంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో కలిపి ఐసీయూ బెడ్స్ మొత్తం 70 వేల నుంచి లక్ష వరకూ ఉంటాయి. జనాభాను బట్టి చూస్తే, ఈ సంఖ్య చాలా తక్కువ, ఆందోళన కలిగించే విషయం కూడా. మనకు సన్నాహాల కోసం ఎక్కువ సమయం కూడా లేదు. చైనా ఎంత వేగంగా స్పందించిందో మనం కూడా అలాగే అవన్నీ చేయాల్సి ఉంటుంది" అని చెప్పారు.

 
"దేశంలో తాత్కాలిక ఆస్పత్రులు నిర్మించాలి. స్టేడియంలను కొన్నిరోజులు ఆస్పత్రులుగా మార్చేయవచ్చు. వీలైనన్ని ఎక్కువ వెంటిలేటర్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి" అన్నారు. ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోడానికి, దానితో పోరాడ్డానికి, కరోనావైరస్ నుంచి తప్పించుకోడానికి ప్రభుత్వం, సామాన్యులు ఎలాంటి చర్యలు పాటించాలి?

 
"మన దగ్గర పరిస్థితిని అదుపు చేయడానికి మూడు వారాల సమయం ఉంది. ఈలోపే అన్నీ చేయాలి. మనం సునామీ దూసుకురావడం కనిపిస్తున్న ఒక ప్రాంతంలో ఉన్నామని ఊహించుకోండి. సమయానికి అప్రమత్తం కాకపోతే, మనం ఆ సునామీ గుప్పిట్లోకి వెళ్లిపోతాం, ప్రాణాలు కోల్పోతాం" అని రమణన్ అన్నారు.

 
ప్రజలు భయపడాల్సిన అవసరంలేదు. ఎలాంటి కల్లోలానికి గురికావద్దు. కానీ ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ఇలాంటివి ఒకేసారి మన ముందుకు వస్తాయని, వినాశనం సృష్టించి మళ్లీ వెళ్లిపోతాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలకి కూడా వాటి ప్రభావం, వాటి నుంచి రక్షించుకునే చర్యల గురించి పెద్దగా తెలిసుండదు. అందుకే వైరస్‌కు గురి కాకుండా, మనల్ని మనం కాపాడుకోడానికి, దానితో పోరాడ్డానికి నడుం బిగించి ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#ClapForRespect జాతి మొత్తం చప్పట్లతో సలాం కొట్టింది..