Publish Date: Mon, 24 May 2021 (16:26 IST)
Updated Date: Mon, 24 May 2021 (16:28 IST)
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా కొనసాగుతున్న యాస్ వచ్చే 24 గంటల్లో అతితీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవులు)కు ఉత్తరాన వాయువ్య దిశలో 620 కిలోమీటర్లు దూరంలో ఉంది. అలాగే, ఇది పారాదీప్ (ఒడిశా) కి 530 కిలోమీటర్లు, బాలసోర్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 630 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్)కి ఆగ్నేయంగా 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైవుంది.
ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ పారాదీప్ మరియు సాగర్ ద్వీపాల మధ్య మే 26 మధ్యాహ్నం తీరం దాటే అవకాశం వుంది. ఈ రోజు, రేపు అక్కడక్కడ ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని, తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందనీ, సముద్రంలో అలలు 2.9 - 4.5 మీటర్ల ఎత్తులో ఎగసి పడతాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.