Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ నగరం నడిబొడ్డున విషాదం...

విశాఖ నగరం నడిబొడ్డున విషాదం...
, మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (21:30 IST)
విశాఖలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో వున్న భవనం కాపౌండ్ వాల్ కూలిపోవడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల క్రింద చిక్కుకున్న కూలీల మృతదేహాలను రెస్క్యూ బృందాలు అతికష్టం మీద బయటకు తీశాయి.

వివరాలు పరిశీలిస్తే... విశాఖ దాబా గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో వున్న భవనం కాపౌండ్ వాల్ అకస్మాత్తుగా కూలిపోయింది. తవ్వకం పనుల్లో వున్న ముగ్గురు కూలీలపై మట్టి పెళ్ళలు పడ్డాయి. ఈ ప్రమాదంలో శంకర్రావ్, శివ శిథిలాల క్రింద చిక్కుకుని మృత్యువాతపడ్డారు. మృతుడు శంకర్రావ్.... విజయనగరం జిల్లా, బాడంగి ప్రాంతానికి చెందినవాడు.

మరో కార్మికుడిని స్థానికులు రక్షించారు. డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రమాదం తర్వాత నిర్మాణ ప్రాంతంలో వున్న కూలీలు షాక్‌కి గురయ్యారు. గాయాలతో బయటపడ్డ కార్మికుణ్ణి వైద్యసేవల కోసం ఆసుపత్రికి తరలించారు.
 
రెస్క్యూ ఆపరేషన్‌ను డీసీపీ రంగారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. హుటాహుటీన ప్రొక్లైనర్లు, ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. స్థానిక కార్మికులతో పాటు రెస్క్యూ సిబ్బంది.... సుమారు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి బండరాళ్ళ మధ్య చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. కోయంబత్తూరుకు చెందిన ఓ మత సంస్థ కోసం ఈ భవన నిర్మాణం జరుగుతోంది. ప్రమాదానికి  కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యమే కారణమని అధికారులు అంచనాకు వచ్చారు. 
 
వినాయకచవితి సెలవు దినమైనప్పటికీ రాత్రి 9 గంటలు దాటినా పనులు ఎందుకు జరుగుతున్నాయనేది ఆరా తీస్తున్నారు. బాధ్యులను అదుపులోకి తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీసీపీ చెప్పారు.

ప్రమాదం చోటుచేసుకున్న కాపౌండ్ వాల్‌ను ఆనుకుని కాలేజ్ హాస్టల్‌తో పాటు బహుళ అంతస్థుల భవనం వున్నాయి. డ్రిల్లింగ్ కారణంగా ఏర్పడ్డ వైబ్రేషన్లతో వాటి భద్రతకు ఏమైనా ప్రమాదం వుందా....? అనే కోణంలోనూ పరిశీలించి ఆమేరకు చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ కొత్త గవర్నర్ తమిళసై... కెసిఆర్‌కి కిరికిరేనా?