Publish Date: Tue, 07 May 2019 (09:41 IST)
Updated Date: Tue, 07 May 2019 (09:43 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపుతో రాజమండ్రి మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయనేత ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపా తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
నిజానికి రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ ఆయన తటస్థంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీలో చేరాల్సిందిగా పలువురు ద్వారా వైకాపా అధినేత జగన్ రాయబారాలు పంపారు.
ఈ విషయంపై వైసీపీ వర్గాలు అవునని సమాధానం ఇవ్వకున్నా మౌనం అంగీకారమనుకోమని చెపుతుండటం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మంచి వ్యూహకర్తగా పేరున్న ఉండవల్లి పార్టీలోకి తీసుకువస్తే గుర్తింపు గౌరవం ఇస్తామని తెల్పడంతో ఉండవల్లి కూడా సై అన్నట్టు తెలుస్తోంది. దీంతో త్వరలో ఆయన వైసీపి తీర్ధం పుచ్చుకునే ఆస్కారం ఉందని రాజకీయవర్గాల మాట.