Publish Date: Wed, 24 Mar 2021 (09:27 IST)
Updated Date: Wed, 24 Mar 2021 (09:29 IST)
తెలుగు రాష్ట్రాలకు భానుడి భగభగ తప్పేలా లేదు. రానున్న మూడు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. సాధారణం కంటే, రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఉత్తరాది నుంచి తేమగాలులు వీస్తున్నాయని, ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి వస్తున్న పొడిగాలులతో అధిక పీడనం ఏర్పడి, ఎండలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఉష్ణోగ్రతలు నడి వేసవిని తలపిస్తూ, 40 డిగ్రీలను దాటవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇదే సమయంలో రాయలసీమలో తేలికపాటి జల్లులకు అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
నెలాఖరులోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఎండ వేడిమి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అసలే కరోనాతో అల్లకల్లోలం అవుతుంటే మరో వైపు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.