Publish Date: Tue, 08 Aug 2023 (12:31 IST)
Updated Date: Tue, 08 Aug 2023 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ విషాదకర ఘటన జరిగింది. యువ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి వివాహమై పక్షం రోజులు కూడా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరూ వేర్వేరుగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు కలకలం రేపింది. సోమవారం భార్య రైలు కిందపడగా.. మంగళవారం ఉదయం భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రైల్వే పోలీసులు, మృతుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడకు చెందిన మంజునాథ్ (26), పొట్లూరి మండలం గరుగు చింతలపల్లి గ్రామానికి చెందిన రమాదేవి (24) ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం పెద్దలను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తాడిపత్రి సమీపంలోని తెల్లవారిపల్లి వద్ద రమాదేవి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తాడిపత్రిలో రైలు కిందపడి మంజునాథ్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఏ కారణంతో ఇలా తనువు చాలించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.