Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయివేటు పాఠశాల సిబ్బందికీ నెలకు రు. 10 వేలు ఇవ్వాలి: అప్సా

ప్రయివేటు పాఠశాల సిబ్బందికీ నెలకు రు. 10 వేలు ఇవ్వాలి: అప్సా
, సోమవారం, 23 నవంబరు 2020 (07:20 IST)
కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న బడ్జెట్ పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆరు నెలలపాటు పాఠశాల సిబ్బంది అందరికీ నెలకు రు. 10 వేలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు పి.మధు అన్నారు.

ఎపి ప్రయివేటు స్కూల్స్ అసోసియేషన్, విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 'బడ్జెట్ పాఠశాలల ఆవేధన - మధు(ర) బాసట' పేరుతో రాష్ట్ర ప్రతినిధుల సమావేశం పోరంకిలోని లక్ష్మీనరసింహా గార్డెన్స్ నుందు జరిగింది. ఈ సమావేశంలో 13జిల్లాల నుండి ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు. తొలుత అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. 
 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా కారణంగా ప్రయివేటు పాఠశాలల పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమేనన్నారు. కాని ఆరు నూరైనా, నూరు ఆరైనా ప్రయివేట్ స్కూల్స్ మనుగడను దెబ్బతీయలేరని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనేక పథకాలు ప్రవేశపెడుతుందని ఇందులో భాగంగానే ప్రయివేటు స్కూలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.

గత పదేళ్లలో విజయవాడ నగరంలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు రాలేదని, కాని నగర జనాభా మాత్రం పెరుగుతున్నారని, ప్రభుత్వం పెట్టకపోగా, ప్రయివేటు పాఠశాలలను నిర్వీర్యం చేసే విధానాలను మానుకోవాలన్నారు. అక్షరాస్యత అభివృద్ధి కాకుండా ఏరంగం కూడా అభివృద్ది కాలేదని, విద్యాభివృద్ధికి బడ్జెట్ స్కూల్స్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు.

కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ స్కూల్స్ ను తక్షణమే ఆదుకోవాలని లేకపోతే పాఠశాలల మనుగడ దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. బడ్జెట్ స్కూల్స్ వ్యాపారం చేయడం లేదని ఎంతో మందికి అతి తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలలగా వీరిని వేధించడం సరైనది కాదని అన్నారు. ప్రయివేటు పాఠశాలలపై వేధింపులను అధికారులను ఆపాలని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 15వేల పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, కరోనా దెబ్బకు విద్యారంగం కుదేలయిందని ముఖ్యంగా ప్రయివేటు విద్యా సంస్థలు నడపలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రయివేటు విద్యా సంస్థల వారికి రాయితీలు ఇవ్వడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ప్రయివేటు సంస్థల వారి సమస్యలను అందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకునే విధంగా కృషి చేద్దామని అన్నారు.
 
మాజీ శాసన మండలి సభ్యులు, విజయవాడ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ చిగురుపాటి వరప్రసాద్ మాట్లాడుతూ కరోనా కారణంగా నేడు ప్రయివేటు విద్యా సంస్థల నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అతి తక్కువ మంది విద్యార్థులతో చక్కటి విద్యను అందిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రయివేటు విద్యా సంస్థలను నడపడం కష్టంగా ఉందన్నారు.

ప్రభుత్వం ప్రయివేటు విద్యా సంస్థలకు రాయితీలు ఇవ్వడంతో పాటు ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏదైనా కష్టం వస్తే కమ్యూనిస్టుల వద్దకు వెళతామని నేడు ప్రయివేటు పాఠశాలల నిర్వాహకుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆదుకోవాలని మధును కోరారు. ప్రయివేటు విద్యా సంస్థల్లో విద్యనభ్యసించిన వారు నేడు ఎంతో మంది ఉన్నతస్థానంలో ఉన్నారని అన్నారు.

నేడు కరోనాతో పాటు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా బడ్జెట్ పాఠశాలల నిర్వహణ కష్టతరమవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అందించే బోధనోపకరణాలను కూడా బడ్జెట్ పాఠశాలలకు కూడా నిర్ణీత రుసుముకు అందించాలన్నారు. అంతకంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగించడంతో పాటు ప్రయివేటు పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం తగిన విధంగా సహకారం అందించాలన్నారు.
 
ఎపి ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మంది విద్యార్థులు బడ్జెట్ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. ప్రయివేటు పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు, 3.5 లక్షల మంది ఉపాధ్యాయులు, మరో 1.5 లక్షల మంది ఆయాలు, డ్రైవర్లు, సూపర్‌వైజర్లు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారన్నారు.

కరోనా కారణంగా విద్యారంగం తీవ్ర సంక్షోభంలో పడిందని దీని కారణంగా పాఠశాలలను నిర్వహించలేక సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితితో పాటు, పాఠశాలల నిర్వహణలో అద్దెలు,కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తంచ ఏశారు. బడ్జెట్ పాఠశాలలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.

తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మాజీ పార్లమెంట్ సభ్యులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును ప్రతినిధిగా ఎన్నుకున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు.
 
ఎపి ప్రయివేట్ స్కూల్స్ అసోషియేషన్ గౌరవాధ్యక్షులు వి.సుందరరామ్ మాట్లాడుతూ ప్రయివేటు విద్యా సంస్థలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు పిల్లలు 90 శాతం మంది ప్రయివేటు పాఠశాలల్లోనే చదువుతున్నారన్నారు. ఈ ఆర్థిక సంక్షోభం నుండి ప్రభుత్వం ఆదుకుని ప్రయివేటు విద్యా రంగాన్ని కాపాడాలన్నారు.
 
సమావేశంలో విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోన సాంబశివరావు, కార్యదర్శి వెనిగళ్ల మురళీధరరావు, ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెట్ట జనార్థనరావు, ఇ.రవిచంద్రారెడ్డి, చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, మామిడి శ్రీనివాసరావు,తో పాటు 13 జిల్లాల ప్రయివేట్ స్కూల్స్ అసోషియేషన్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శిలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ పార్టీలో ఫైవ్‌స్టార్ కల్చర్ పెరిగిపోయింది... గులాం నబీ ఆజాద్