Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఎగుమతిపై సమీక్ష

ఏపీ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఎగుమతిపై సమీక్ష
, శుక్రవారం, 16 జులై 2021 (23:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న చేనేత వస్త్రాలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు గల అవకాశాలపై ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, అధికారులు చెన్నైలో కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (హెచ్ఈపీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న చేనేత వస్త్రాలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
 
ఎంతో నైపుణ్యం కలిగిన ఇక్కడి చేనేత కళాకారులు సహజసిద్ధమైన రంగులు, నూలు ద్వారా కళాత్మకమైన డిజైన్లు రూపొందించగలరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నీ మగ్గలపై నూతన డిజైన్లు నేసే విధంగా ఇప్పటికే తగిన సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా “ఆర్గానిక్ చేనేత” వస్త్రాలను కూడా నూతనంగా ప్రవేశ పెడుతున్నట్టు వివరించారు. ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా పండించిన పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరించిన రంగులను వినియోగించి చేనేత వస్త్రాలను నేయిస్తున్నట్టు హెచ్ఈపీసీ అధికారులకు తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట తదితర ప్రాంతాల్లో ఆర్గానిక్ చేనేత వస్త్రాలను నేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఆర్గానిక్ చేనేత వస్త్రాలను ధరించడం వలన చర్మ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంతోపాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నరు. ఆప్కో ఛైర్మన్ మోహనరావు మాట్లాడుతూ భారతీయ కళా వైభవాన్ని విదేశాలకు చాటి చెప్పే కార్యచరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండ్, మార్కెటింగ్ కల్పించేందుకు ఆప్కో ద్వారా కృషి చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే హెచ్ఈపీసీ అధికారులను కలిసినట్టు వివరించారు.
 
భారతీయ సాంప్రదాయ వస్త్రధారణకు దగ్గరగా ఉండే శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు చేనేత వస్త్రాలను ఎగుమతి చేస్తే మన దేశ ఖ్యాతి ఇనుమడించడంతోపాటు ఇక్కడి చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. నేత కార్మికులు కాలం చెల్లిన ముతక డిజైన్లకు స్వస్తి పలికి కాలానుగుణంగా సరికొత్త డిజైన్లు రూపొందిస్తేనే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ప్రైవేటు మాస్టర్ వీరర్లు కూడా తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టె దిశగా ఆలోచించాలన్నారు. అంతర్జాతీయంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తే రూ. అయిదు లక్షల వరకు ఖర్చు అవుతుందని, అందులో దాదాపు రూ.50 వేల వరకు సబ్సిడీ రూపంలో వస్తుందని చెప్పారు.
 
అంతర్జాతీయ ఎగుమతులను తమిళనాడులోని కోఆప్టెక్స్ బాగా వినియోగించుకుంటుందని, అదే విధంగా ఆప్కో ద్వారా కూడా చేనేత వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టి నేత కార్మికుల జీవనోపాధిని మెరుగు పరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే అంతర్జాతీయ ఎగుమతులు, స్టాల్స్ ఏర్పాటు, డిజైన్లపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేయగలమని హెచ్ఈపీసీ అధికారులు తెలిపినట్టు మోహనరావు పేర్కొన్నారు.
 
హెచ్ఈపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ చేతితో నేసిన ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా హెచ్ఈపీసీ ఆధ్వర్యంలో ప్రతి నెలా నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయలేదన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు.
 
ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హెచ్ఈపీసీ ఆధ్వర్యంలో ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు అయిదు రోజులపాటు భారతదేశ సాంప్రదాయ వస్త్రాలు పేరిట అంతర్జాతీయ వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తునట్టు తెలిపారు. ఈ కరోనా మహమ్మారి కాలంలో చేతితో నేసిన ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి వర్చువల్ ప్లాట్‌ఫాంల ద్వారా మార్కెటింగ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు హెచ్ఈపీసీ ఆధ్వర్యంలో వర్చువల్ ఈవెంట్ ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు. 
అయిదు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భారతదేశం నలుమూలల నుండి 50 మంది చేతితో వస్త్రాలు నేసిన తయారీదారులు, ఎగుమతిదారులు, సహకార సంస్థలు, జాతీయ అవార్డు గ్రహీతలు, క్లస్టర్లు, ఇండియా చేనేత బ్రాండ్ (ఐహెచ్‌బి) హోల్డర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హ్యాండ్లూమ్స్ కు మంచి డిమాండ్ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్గానిక్ చేనేత వస్త్రాలను ప్రవేశపెట్టడం అభినందనీయమని, అంతర్జాతీయ మార్కెట్లోకి వీటిని తీసుకువస్తే కచ్చితంగా విశేష ఆదరణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఏపీ చేనేత వస్త్రాలను అంతర్జాతీయ ఎగుమతి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆప్కో తరపున ఛైర్మన్ మోహనరావు హెచ్ఈపీసీ ఈడీ శ్రీధర్ కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈపీసీ డిప్యూటీ డైరెక్టర్ పీ. రంగస్వామి, జాయింట్ డైరెక్టర్ సుందర మురుగేశన్, ఆప్కో డీఏంవో ప్రసాద్ రెడ్డి, చెన్నై ఆప్కో మెగా షోరూం మేనేజరు ఎన్. కోటేశ్వరరావు, మాస్టర్ వీవర్స్ తరపున బండారు ఆనంద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్టుల‌న్నీ భర్తీ చేయ్, పెద్ద మొగోడు అనుకుంటా: కేటీయార్ పైన ష‌ర్మిలా కామెంట్