Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతి కోసం రీ మాస్టర్ ప్లాన్

అమరావతి కోసం రీ మాస్టర్ ప్లాన్
, సోమవారం, 14 అక్టోబరు 2019 (07:39 IST)
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సింగపూర్‌ సంస్థ అందించిన మాస్టర్‌ ప్లాన్‌ను తాజా అంచనాలకు అనుగుణంగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలోనే రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) 543 కోట్ల రూపాయలు ఆదా అయ్యేలా కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను ప్రభుత్వానికి అందజేసింది.
 
అమరావతిపై సీఆర్డీయే తాజాగా సమర్పించిన మాస్టర్‌ ప్లాన్‌పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ వైఖరికి అనుగుణంగానే సీఆర్డీయే సింగపూర్‌ సంస్థ రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో పలు సవరణలు చేసినట్టు భావిస్తున్నారు.

సీఆర్డీయే తాజాగా ప్రభుత్వానికి అందజేసిన మాస్టర్‌ ప్లాన్‌లో నిర్మాణ విస్తీర్ణాన్ని కుదించారు. నిర్మాణ వ్యయంలో గతంతో పోల్చుకుంటే 543 కోట్ల రూపాయలు ఆదా అయ్యే విధంగా సీఆర్డీయే అంచనాలను సవరించింది. తాజా అంచనాల ప్రకారం ప్రతిపాదిత నిర్మాణాల వ్యయం 4 వేల 106 కోట్ల రూపాయలుగా వున్నది.
 
సీఆర్డీయే తాజాగా ప్రభుత్వానికి అందజేసిన మాస్టర్‌ ప్లాన్‌లో పలు నిర్మాణాలు ప్రాధాన్యతలు నిర్ణయించారు. ప్రాధాన్యాలకు అనుగుణంగా విస్తీర్ణాన్ని సైతం కుదించారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిలో భాగంగా వున్న కొన్ని నిర్మాణాలను మినహాయించారు.

అమరావతిలో నిర్మాణాల విస్తీర్ణం 54 లక్షల 75 వేల చదరపు అడుగులుగా నిర్ణయించారు. ఒక్కొక్క చదరపు అడుగుకు 7,500 రూపాయలు వ్యయం అయ్యే విధంగా నిబంధనలు రూపొందించారు. దీని ప్రకారం రూ.4,106 కోట్ల అంచనా వ్యయం అవుతుంది.

2018-19 సంవత్సరానికి సంబంధించి వ్యయం చేసిన 150 కోట్లు, 2019-20కి సంబంధించి ఖర్చు పెడుతున్న 350 కోట్ల రూపాయలను మినహాయిస్తే మిగిలిన మొత్తాన్ని మూడు ఆర్థిక సంవత్సరాలలో సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందించారు. 2020-21లో వెయ్యి కోట్లు, 2021-22లో 15 వందల కోట్లు, 2022-23లో 1106 కోట్ల రూపాయల వ్యయం చేయాలని ప్రతిపాదించారు.

నిర్మాణ వ్యయంలో 20శాతం నిధులను కేంద్రప్రభుత్వం నుంచి అడగాలని భావిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని మార్కెట్‌లోని వివిధ సంస్థల నుంచి రుణంగా సమకూర్చుకోవాలని అధికారుల ప్రతిపాదనగా వున్నది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చిన సంస్థలకు 18 సంవత్సరాలలో తిరిగి చెల్లించి వేసి, అమరావతి స్వయం సమృద్ధం అయ్యేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు.
 
గుజరాత్‌లోని గాంధీనగర్‌, నయా రాయపూర్‌ల తరహాలోనే అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌లో ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆయా నగరాలలో సచివాలయంతో వివిధ ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాన్నీ ఒకే ప్రదేశంలో అనుసంధానమై వుంటాయి.

దీనివల్ల పాలనా సౌలభ్యం చేకూరుతుంది. అమరావతి సైతం అదే తరహాలో నిర్మాణం జరపాలని సీఆర్డీయే అధికారులు తలపోస్తున్నారు. తదనుగుణంగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. అమరావతి నిర్మాణం ప్రత్యేకతలతో కూడుకొని ఉండాల్సిన అవసరమున్నదని అధికార యంత్రాంగం భావిస్తున్నది.

ప్రపంచ పటంపై అమరావతి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాల్సిన అవసరముందని సీఆర్డీయే అధికారులు ప్రభుత్వానికి అందజేసిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. గతంలో సింగపూర్‌ సంస్థ ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌లో 13 రకాలైన మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించి 1147 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు.

సీఆర్డీయే అధికారులు తాజాగా ఇచ్చిన ప్రతిపాదనలలో పలు అంశాలను తొలగించారు. దీనివల్ల 445 కోట్ల రూపాయల వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. వాహనాల కోసం ప్రత్యేక బ్రిడ్జ్‌ ల నిర్మాణానికి 19 కోట్లు, పాదచారుల ప్రత్యేక రహదారుల కోసం 234 కోట్లు, ఆస్టరిక్‌ చాంబర్ల నిర్మాణానికి 192 కోట్ల రూపాయల వ్యయం కాగలదని గతంలో ప్రతిపాదించారు.

ఇప్పుడు ఆ నిర్మాణాల అవసరం లేదని పేర్కొంటూ, మాస్టర్‌ ప్లాన్‌ నుంచి వాటిని తొలగించారు. ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు, అధునాతన లైటింగ్‌ వ్యవస్థ వంటి వాటిని నూతన ప్లాన్‌లో మినహాయించారు.
 
అమరావతి ప్రాంతంలో రహదారులను సిమెంట్‌, కాంక్రీట్‌తో కాకుండా బీటీ రోడ్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. సిమెంట్‌, కాంక్రీట్‌ (సీసీ) రోడ్డుకు అన్ని లేయర్లతో కలుపుకొని ఒక చదరపు మీటరుకు 2,100 రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు.

అదేవిధంగా బీటీ రోడ్డుకు అన్ని లేయర్లతో కలుపుకొని ఒక చదరపు మీటరకు 2,040 రూపాయల ఖర్చు అవుతుంది. రాజధాని ప్రాంతంలో 67 లక్షల 30వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రహదారులను నియమించాల్సి వున్నది. ఆ మొత్తాన్ని బీటీ రోడ్లు వేయటం వల్ల 40 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నదని సీఆర్డీయే అధికారులు తాజాగా రూపొందించిన అంచనాలలో ప్రతిపాదించారు.
 
సీఆర్డీయే అధికారులు తాజాగా ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌లో నిర్మాణాలకు సంబంధించి రెండు రకాల ప్రాధాన్యాలను నిర్ణయించారు. హైకోర్టు శాశ్వత భవనాలతోపాటు, అమరావతి ఐటీ పార్క్‌ను ద్వితీయ ప్రాధాన్యతా క్రమంలో చేర్చారు.

తొలి ప్రాధాన్యతగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత స్థాయి అధికారుల కోసం బహుళ అంతస్తుల భవనాలలో 432 ప్లాట్‌ల నిర్మాణం చేపడతారు. ఎన్జీవోల కోసం 1968, 1440 ప్లాట్‌లను నిర్మించి వారి వారి హోదాలననుసరించి కేటాయింపులు జరుపుతారు.

మంత్రులు, న్యాయమూర్తుల కోసం 71, కార్యదర్శులు, ప్రిన్సిపల్‌ కార్యదర్శి హోదా వున్న అధికారుల కోసం 115 బంగ్లాలు నిర్మిస్తారు. అదేవిధంగా మూడు పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. జ్యుడిషియల్‌ కాంప్లెక్స్‌, హ్యపీనెస్ట్‌, ఏపీ సీఆర్డీయే ప్రాజెక్ట్‌ కార్యాలయం తదితర నిర్మాణాలన్నింటినీ మొదటి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని తాజా మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించారు.
 
సీఆర్డీయే తాజాగా ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధాని ప్రాంతంలో నిర్మాణాలన్నీ 2023వ సంవత్సరం నాటికి పూర్తి కావాల్సి వుంది. అప్పటివరకు గుంటూరు, విజయవాడలలో వున్న శాఖాధిపతుల కార్యాలయాలను మంగళగిరి ప్రాంతంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణం, దాని పక్కనే ఉన్న ప్రైవేట్‌ భవన సముదాయంలోకి మార్చాలని యోచిస్తున్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెయింట్‌గా మరియం థ్రెసియా: ప్రకటించిన పోప్‌ ఫ్రాన్సిస్‌