Publish Date: Mon, 04 Apr 2022 (16:23 IST)
Updated Date: Mon, 04 Apr 2022 (16:25 IST)
కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా సీమకు తీర ప్రాంతం వచ్చింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది.
కానీ ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది.
ఇకపోతే.. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి. ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు.
సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది.
మరోవైపు ఏపీలో కొత్త శకం ప్రారంభం కాబోతోందన్నారు ఏపీ సీఎం జగన్. పరిపాలనా వికేంద్రీకరణలో అడుగు ముందుకేశామని అభిప్రాయపడ్డారు.
కొత్త జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పాలనా వికేంద్రకరణ ఒక్కటే లక్ష్యంగా కాకుండా.. గిరిజనులకు ఉపయోగపడేలా, స్వాతంత్ర్య సమరయోధులు, వాగ్గేయకారులను స్మరించుకుంటూ జిల్లాలకు పేర్లు పెట్టినట్లు జగన్ తెలిపారు.
గతంలో ఉన్న జిల్లాల పేర్లను అలాగే ఉంచుతూ.. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించామని జగన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.